

హైదరాబాద్: వన్డేల్లో రెండు కొత్త బంతులను ఉపయోగించడాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తప్పుబట్టాడు. వన్డే క్రికెట్ను నాశనం చేయడానికి ఈ రెండు బంతుల కాన్సెప్ట్ తన వంతు పాత్ర పోషిస్తున్నదని సచిన్ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 481 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్సిన నేపథ్యంలో సచిన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
వన్డేల్లో రెండు బంతులను వాడటం వల్ల పేస్ బౌలర్ల అస్త్రమైన రివర్స్ స్వింగ్ వన్డే క్రికెట్లో కనిపించకుండా పోయిందని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఒక్కో ఎండ్ నుంచి ఒక్కో బంతిని వాడటం వల్ల అవి డెత్ ఓవర్లు వచ్చినా రివర్స్ స్వింగ్కు ఉపయోగపడేలా పాతబడటం లేదని సచిన్ పేర్కొన్నాడు.
'వన్డే మ్యాచ్లో రెండు కొత్త బంతులు వాడటం అనేది వినాశనానికి అత్యుత్తమమైన విధానం. రివర్స్ స్వింగ్కు అనుకూలించేలా బంతి పాతబడటానికి సమయం ఉండదు. రెండు కొత్త బంతుల విధానం వల్ల రివర్స్ స్వింగ్ను చూసే అవకాశం ఉండదు' అని సచిన్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
సచిన్ అభిప్రాయాలతో పాకిస్థాన్ లెజెండరీ పేస్ బౌలర్ వకార్ యూనిస్ ఏకీభవించాడు. నిజానికి ఈ రెండు బంతుల నిబంధన వల్లే రివర్స్ స్వింగ్ వన్డేల నుంచి దాదాపు మాయమైపోయిందని వకార్ ట్వీట్ చేశాడు. "ఈ కారణంతోనే ఎక్కువ మంది అటాకింగ్ ఫాస్ట్ బౌలర్లను తయారు చేయలేకపోతున్నాం. రెండు కొత్త బంతులు వాడటం వల్ల బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. లైనప్ మారుస్తున్నారు. నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా సచిన్" అంటూ ట్వీట్ చేశాడు.
సచిన్, వకార్ యూనిసే కాదు... వెస్టిండిస్ దిగ్గజ బౌలర్ మైకేల్ హోల్డింగ్ కూడా ఈ నిబంధనను తీవ్రంగా తప్పుబట్టాడు. రెడ్ బాల్తో పోలిస్తే వైట్ బాల్ కాస్త డిఫరెంట్గా ఉంటుందని, రెండు కొత్త రెడ్ బాల్స్ వాడితే మంచిదే అయినా.. రెండు వైట్ బాల్స్ వల్ల బౌలర్లకు నష్టమే అని హోల్డింగ్ గతంలోనే చెప్పాడు.
వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉపయోగించేలా ఐసీసీ 2011 అక్టోబర్లో నిబంధనలను సవరించింది. దీని ప్రకారం ఒక ఓవర్ వేసేటప్పుడు ఒక అంపైర్ ఒక బంతిని వాడితే.. మరో ఓవర్కు రెండో అంపైర్ తన దగ్గరున్న బంతిని వాడతాడు. అంటే 50 ఓవర్ల ఆటలో ఒక బంతిని 25 ఓవర్ల చొప్పున వాడుతున్నారు.
మొదట్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పేస్ బౌలర్లకు ఓ అవకాశం ఇచ్చే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.