ఒకే సంవత్సరంలో రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎడిషన్లు తప్పకుండా జరుగుతాయంటూ టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే వచ్చే ఏడిదికో.. ఆ మరుసటి ఏడాదికో ఈ మార్పులు చోటుచేసుకోవని, కనీసం అయిదేళ్లయినా పడుతుందని ఆకాష్ చోప్రా అంచనా వేశాడు. 15ఏళ్లుగా అత్యంత ఆదరణతో ఐపీఎల్ టోర్నీ విజయవంతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇన్నేళ్లలో ఈ క్యాష్ రీచ్ లీగ్ ఎన్నో మార్పులకు గురైంది. ఇక ఐపీఎల్ 2022 ఎడిషన్కు ముందు 8జట్లు ఆడేవి కాగా.. ఈసారి రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (GT) టోర్నీలోకి వచ్చాయి.
కొన్ని సంవత్సరాల తర్వాత ఐపీఎల్ రెండు సీజన్లను నిర్వహించడం గురించి బీసీసీఐ తప్పకుండా ఆలోచనలు చేస్తుందని చోప్రా పేర్కొన్నాడు. "ఒక్క సంవత్సరం రెండు ఐపీఎల్లు అవసరమా అని మీకు అనిపించొచ్చు. ఇది అవసరమా కాదా అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే దీనికి ఉండే ఆదరణనే అవసరంగా మార్చేస్తుంది. ఇక ఒకే సంవత్సరం రెండు ఐపీఎల్లు జరుగుతాయా జరగవా అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్. అయినా నా మట్టుకు మాత్రం కచ్చితంగా రెండు ఐపీఎల్ సీజన్లు జరుగుతాయని భావిస్తున్నాను' అని చోప్రా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. ఇకపోతే మీడియా రైట్స్ హక్కుల వేలం ఇప్పటికే ముగిసినందున ఈ ఐదేళ్లలో రెండు ఎడిషన్ల ఐపీఎల్ జరిగే పాజిబులిటీ లేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కానీ ఆ తర్వాత ఐదేళ్లలో 100% రెండు ఎడిషన్లు జరుగుతాయన్నాడు. ఇక ఎడిషన్లలో ఒకటి బిగ్ ఐపీఎల్ ఉంటుందని, అందులో 94మ్యాచ్లు జరుగుతాయని తెలిపాడు. ఇక చిన్న ఐపీఎల్ కేవలం ఒక నెలలో ముగుస్తుందని, అందులో 40నుంచి 50 మ్యాచ్లు జరగొచ్చని పేర్కొన్నాడు. ఇకపోతే ఐపీఎల్ 2022 ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగగా.. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను ఓడించిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజారత్ టైటాన్స్ అరంగేట్రంలోనే ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది.