హైదరాబాద్: ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ప్రముఖులపై విమర్శనాస్త్రాలు సంధించే ఆండ్రూ ఎలిజర్ అనే నెటిజన్పై సచిన్ అభిమానులు వరుస దాడికి పాల్పడ్డారు. దాడికి తట్టుకోలేని ఆండ్రూ ఎలిజర్ అలియాస్ డెక్స్టర్ పాజీ తన ట్వీట్ డిలీట్ చేసినా ఏ మాత్రం ఉపయోగం లేకుండాపోయింది.
సచిన్ చేసిన ట్వీట్ను ట్రోల్ చేశాడనే కారణంతో అతని అభిమానులు.. అతడితో ఆటాడుకున్నారు. సచిన్ను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయడంతో.. వివాదం మొదలైంది. ట్రోల్ మాస్టర్గా పేరొందిన ఆండ్రూ (డెక్స్టర్ పాజీ) కి మద్దతు కొందరు ట్వీట్లు పెడుతున్నారు.
#Isupportdexterpaaji హ్యాష్ ట్యాగ్తో ట్వీట్లు చేస్తూ అతడికి బాసటగా నిలుస్తున్నారు. అసలు ఈ వార్ ఎలా మొదలైందో చూద్దాం.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించగా.. మాజీలు, క్రికెట్ ప్రేమికులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ వివాదం గురించి సచిన్ కూడా స్పందించాడు.
అసలు గొడవేంటి:
'క్రికెట్ జెంటిల్మన్ గేమ్. ఎలాంటి వివాదాలకు, అక్రమాలకే తావు ఇవ్వకుండా ఆడాలి. బాల్ ట్యాంపరింగ్ వివాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం. కానీ ఆట సమగ్రతను పెంపొందించే దిశగా సరైన నిర్ణయం తీసుకున్నారు. గెలవడం ముఖ్యమే కానీ గెలిచే విధానం అంత కంటే ముఖ్యం' అని సచిన్ ట్వీట్ చేశాడు.
ట్రోలింగ్ ట్వీట్:
సచిన్ ట్వీట్కు ఆండ్రూ ఎలిజెర్ బదులిస్తూ.. మ్యాచ్ గెలవడం కంటే సెంచరీ చేయడం ముఖ్యం అని ట్వీట్ చేశాడు. సచిన్ను క్రికెట్ దేవుడిలా భావించే అభిమానులకు మనోడి రిప్లయ్తో చిర్రెత్తుకొచ్చింది. వరుసబెట్టి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. దీంతో వెనక్కుతగ్గిన ఆండ్రూ ట్వీట్ను తొలగించాడు. అయినా సచిన్ ఫ్యాన్స్ మాత్రం ఆగలేదు.