సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియాతో తలపడేటప్పుడు ఇటీవల ఇంగ్లండ్పై సాధించిన టెస్టు సిరీస్ విజయం లెక్కలోకి రాదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. కివీస్ ఆటగాళ్లు బాగా సన్నద్ధమయ్యేందుకు అది ప్రాక్టీస్ మ్యాచ్లా ఉపయోగపడిందన్నాడు. కోహ్లీసేనతో ఫైనల్లో తలపడేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బౌల్ట్ తెలిపాడు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్పై గెలుపొందాక న్యూజిలాండ్ జట్టు మంగళవారం సౌథాంప్టన్కు చేరుకుంది. ఈ సందర్భంగా ట్రెంట్ బౌల్ట్ మీడియాతో మాట్లాడుతూ... 'డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో భారత్తో ఆడేటప్పుడు ఇంగ్లండ్పై సాధించిన టెస్ట్ సిరీస్ విజయం పెద్దగా లెక్కలోకి రాదని నేను అనుకుంటున్నా. మా ఆటగాళ్లు బాగా సన్నద్ధమయ్యేందుకు అది ఓ ప్రాక్టీస్ మ్యాచ్లా ఉపయోగపడింది. భారత్ బలమైన జట్టు. అందుకే నేను అలా భావిస్తున్నా. ఇక కోహ్లీసేనతో ఫైనల్లో తలపడేందుకు నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఫైనల్లో మేం మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా. తొలిసారి జరుగుతున్నా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిస్తే.. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది' అని అన్నాడు.
'నేను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం వల్ల భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు తెలిసిన వాళ్లు ఉంటారు. అయితే నేను ఆడే ముంబై ఇండియన్స్ జట్టులో ఇప్పటివరకు ఒక్కర్ని కూడా చూడలేదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తుండటం వల్ల నేను వారిని చూడలేదేమో. అయితే ఫైనల్లో మా రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొని ఉంటుందని భావిస్తున్నా' అని కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్పై బౌల్ట్ ఒక టెస్ట్ మాత్రమే ఆడాడు. కివీస్ 1-0తో ఇంగ్లండ్పై టెస్ట్ సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే.
టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే న్యూజిలాండ్ జట్టును కివీస్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో రెండో టెస్టుకు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతడు మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కీపర్ బీజే వాట్లింగ్ కూడా అందుబాటులోకి వచ్చాడు. కోలిన్ డీ గ్రాండ్హోమ్ను స్పెషలిస్ట్ ఆల్రౌండర్గా.. అజాజ్ పటేల్ను స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎంపికచేశారు. సౌథాంప్టన్ పిచ్ పేస్కి అనుకూలించనుండడంతో .. అజాజ్ పటేల్ రూపంలో కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్కి టీమ్లో కివీస్ చోటిచ్చింది. ఇక బ్యాకప్ కీపర్గా టామ్ బ్లండెల్ ఎంపికయ్యాడు.
కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్.