రోహిత్ శర్మ.. 5.24 లక్షలు
హిట్మ్యాన్ రోహిత్ శర్మ జట్టుకే బలహీనంగా తయారైయ్యాడు. ఒకటి అర మ్యాచ్లు మినహాయించి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆ జట్టును కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేర్చలేకపోయాడు. 14 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 286 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ అటు బ్యాట్స్మెన్గా, ఇటు కెప్టెన్గానూ విఫలమయ్యాడు. దీంతో 15 కోట్ల రూపాయలకు రోహిత్ను రీటేన్ చేసుకున్న ముంబై జట్టు ఒక్కో పరుగుకు 5.24 లక్షల రూపాయలను చెల్లించుకుంది.
బెన్స్టోక్స్.. 6.37 లక్షలు
రాజస్థాన్ జట్టులో అత్యధిక ధర కలిగిన ఆటగాడు బెన్ స్టోక్స్. 2017 ఐపీఎల్ సీజన్లో అత్యధిక ధర(14. 50 కోట్లు)కు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్. రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఫ్రాంచైజీ తొలగింపుతో రాజస్థాన్ రాయల్స్ ఈ సారి 12.5 కోట్లు వెచ్చించి మరీ స్టోక్స్ను కొనుగోలు చేసింది. అయితే 13 మ్యాచ్లు ఆడిన స్టోక్స్ కేవలం 196 పరుగులు చేసి, 8 వికెట్లు మాత్రమే తీశాడు. అంటే ఒక్కో పరుగుకు 6.37 లక్షలు, ఒక్కో వికెట్కు 1.56 కోట్ల రూపాయలు చెల్లించినట్లయింది. ఏదైతేనేమి స్టోక్స్ అంతగా రాణించకపోయినప్పటికీ ఆర్ఆర్ జట్టు ప్లే ఆఫ్కు అర్హత సాధించింది.
గ్లెన్ మాక్స్వెల్.. 5.32 లక్షలు
ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్కు ఢిల్లీ జట్టు 9 కోట్ల భారీ మొత్తం చెల్లించుకుంది. యాజమాన్యం పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. 12 ఇన్నింగ్స్లో 14.08 సగటుతో 169 పరుగులు మాత్రమే చేసిన మాక్స్వెల్కు ఒక్కో పరుగుకు 5.32 లక్షల భారీ మొత్తం చెల్లించినట్టయింది.
విరాట్ కోహ్లి... 3.2 లక్షలు
పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని బెంగళూరు యాజమాన్యం 17 కోట్ల రూపాయలు చెల్లించి రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం గమనార్హం. 14 ఇన్నింగ్స్లో 48.18 సగటుతో 530 పరుగులు చేసిన కోహ్లి.. విలువకు తగ్గట్టుగా రాణించాడు. కానీ జట్టును ప్లే ఆఫ్కు చేర్చలేక పోయాడు. కోహ్లి చేసిన ఒక్కో పరుగు విలువ 3.20 లక్షలు.
హార్ధిక్ పాండ్యా.. 4.24 లక్షలు
ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ 11 కోట్ల రూపాయలకు అంటిపెట్టుకుంది. అయితే 13 మ్యాచ్లాడిన జూనియర్ పాండ్యా కేవలం 260 పరుగులకే పరిమితమై.. 18 వికెట్లు తీశాడు. అంటే ఒక్కో పరుగుకు 4. 24 లక్షలు, ఒక్కో వికెట్కు 6.11 లక్షల రూపాయలుగా జట్టుకు న్యాయం చేశాడు.
రిషభ్ పంత్.. 1.16 లక్షలు
ఐపీఎల్11వ సీజన్లో లీగ్ దశ పూర్తయ్యేసరికి అత్యధిక పరుగులు(684) చేసిన ఘనత ఢిల్లీ డేర్డెవిల్స్ ఆటగాడు రిషభ్ పంత్కే దక్కుతుంది. ఆరెంజ్ క్యాప్ దక్కించుకొన్న ఈ యువ ఆటగాడు అద్భుత ప్రదర్శన కనబరచి ‘స్టార్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 8 కోట్ల రూపాయలకు పంత్ను రీటేన్ చేసుకున్న ఢిల్లీ జట్టుకు అతడు న్యాయం చేశాడనే చెప్పాలి. 14 మ్యాచ్లు ఆడిన పంత్ 52. 61 సగటుతో 684 పరుగులు చేశాడు. అంటే ఒక్కో పరుగుకు పంత్ తీసుకున్న మొత్తం 1. 16 లక్షలే. కాకపోతే, డీడీ జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండడం యాజమాన్యాన్ని నిరాశకు గురిచేసింది.
జోస్ బట్లర్.. 80 వేలు
4.40 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆరంభంలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన బట్లర్.. పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడైతే ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడో అప్పటి నుంచి బ్యాట్ ఝుళిపించి పరుగుల వరద పారించాడు. 13 ఇన్నింగ్స్లో ఆడిన బట్లర్ 548 పరుగులు చేశాడు. ఇందులో ఐదు వరుస హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఒక్కో పరుగుకు 80 వేల రూపాయలు ఆర్జించిన బట్లర్ జట్టును ప్లే ఆఫ్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆండ్రూ టై... 30 లక్షలు
ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టైని పంజాబ్ ఫ్రాంచైజీ 7. 20 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. అందుకు తగ్గట్టుగానే బంతితో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ తిప్పలు పెట్టి లీగ్ దశ ముగిసేసరికి పర్పుల్ క్యాప్ సాధించాడు.14 మ్యాచ్లు ఆడిన టై 24 వికెట్లు తీసి తన వంతు పాత్ర పోషించాడు. దీంతో ఆండ్రూ టై తీసిన ఒక్కో వికెట్ విలువ అక్షరాలా రూ.30 లక్షలు.
ట్రెంట్ బౌల్ట్.. 12.2 లక్షలు
ఈ సీజన్లో 18 వికెట్లు తీసిన ఈ కివీస్ బౌలర్ను ఢిల్టీ జట్టు 2. 20 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. తనను కొనుగోలు చేసిన ఢిల్లీ జట్టు అతి కొద్ది విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన బౌల్ట్.. తీసిన ఒక్కో వికెట్కు 12. 2 లక్షల రూపాయల చొప్పున ఆర్జించగలిగాడు.
మయాంక్ మార్కండే.. 1.33 లక్షలు
భారత యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ముంబై జట్టు తనపై వెచ్చించిన 20 లక్షల రూపాయలకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు. టోర్నీ మొత్తంలో 15 వికెట్లు తీసిన మయాంక్ ముంబై జట్టులో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. మయాంక్ తీసిన ఒక్కో వికెట్ విలువ 1. 33 లక్షల రూపాయలు.