ఇంగ్లాండ్
సొంతగడ్డపై ఆతిథ్య జట్టు ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. జట్టులోని ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. తమదైన రోజున ఇంగ్లాండ్ ఆటగాళ్లు జేసన్ రాయ్, జో రూట్, ఇయాన్ మోర్గాన్లు చెలరేగి ఆడతారు. ఇక, వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరిస్లో ఇంగ్లీషు బ్యాట్స్మెన్ పరుగుల వరద పారిస్తున్నారు. బ్రిస్టల్ వేదికగా మే 14న పాక్తో జరిగిన మ్యాచ్లో బెయిర్ స్టో 93 బంతుల్లో 128 పరుగులతో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇండియా
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటి. బ్యాటింగ్ పవర్హౌస్గా పేరుగాంచిన భారత జట్టులో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నమెంట్లలో భారత్కు మెరుగైన రికార్డు ఉండటం కూడా కలిసొచ్చే అంశం. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో ధోని నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు భారత్ తొలి వరల్డ్కప్ను గెలిచింది కూడా ఇంగ్లాండ్లోనే. 1983 వరల్డ్కప్ ఫైనల్లో కపిల్ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ విజయం సాధించి తొలి వరల్డ్కప్ను గెలిచిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్
ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తోన్న జట్లలో న్యూజిలాండ్ ఒకటి. ఇప్పటివరకు వరల్డ్కప్ గెలవకున్నా గత వరల్డ్కప్లో ఆ అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. 7 సార్లు సెమీ ఫైనల్కు చేరిన న్యూజిలాండ్ 2015 వరల్డ్కప్లో ఫైనల్కు కూడా వెళ్లింది. పైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్కప్లో కివీస్ స్టార్ ప్లేయర్లు బ్రెండన్ మెక్కల్లమ్, రాస్ టేలర్ను ఆ దేశ అభిమానులు మిస్సవుతున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న జట్టులో మ్యాచ్ని మలుపుతిప్ప ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
దక్షిణాఫ్రికా
ఇప్పటివరకు ఐసీసీ వన్డే వరల్డ్కప్ గెలవని జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. 1992 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్థాన్, భారత్, జింబాబ్వేలపై వరుస విజయాలను నమోదు చేసి సెమీఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో చోటు చేసుకున్న ఓ అనూహ్య పరిమాణంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, ప్రస్తుతం సఫారీల బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ ఎటాక్ను చూస్తే వరల్డ్కప్ గెలిచే జట్టలో ఒకటిగా కనబడుతోంది. గత వరల్డ్కప్లో కూడా సఫారీలు మెరుగైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గత వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ చేతిలో సెమీఫైనల్ మ్యాచ్లో ఓడింది. అయితే, ఈసారి మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోవాలని సఫారీలు భావిస్తున్నారు.
పాకిస్థాన్
ఇంగ్లీషు గడ్డపై పాకిస్థాన్ రెండు మేజర్ ఐసీసీ టోర్నీలను గెలిచింది. మొదటిది 2009లో టీ20 వరల్డ్కప్ కాగా... రెండోది ఛాంపియన్స్ ట్రోఫీ. పరిమిత ఓవర్ల క్రికెట్లో పాకిస్థాన్ జట్టు ఫామ్ని ఊహించడం కష్టం. ఆ జట్టులోని ఆటగాళ్లు ఎప్పుడు రాణిస్తారో ఎప్పుడు నిరాశపరుస్తారో చెప్పడం కష్టం. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాకిస్థాన్ ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ విజేతగా నిలిచే జట్లలో పాక్ కూడా ఒకటిగా ఉంది.