లక్ష్యం చిన్నదైపోయింది:
మ్యాచ్ అనంతరం టామ్ లాథమ్ మాట్లాడుతూ... 'మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసారు. ఈ విజయాన్ని సిరీస్ ఆద్యంతం కొనసాగిస్తాం. మేము భారీ భాగస్వామ్యాలను నమోదు చేశాం. దాంతో భారత్ నిర్దేశించిన లక్ష్యం చిన్నదైపోయింది. ఆరంభంలో ఓపెనర్లు పరుగులు చేయడంతో ఆ తర్వాత మేం స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కుదిరింది. కుడి-ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ప్రణాళిక సక్సెస్ అయ్యింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. ఆ ప్రణాళికతలో టీమిండియాపై పైచేయి సాధించాం' అని అన్నాడు.
బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు:
'రాస్ టేలర్ సుదీర్ఘ ఇన్నింగ్స్ అద్భుతం. కీలక సమయంలో విలువైన పరుగులు చేసాడు. ఓపెనర్ హెన్రీ నికోల్స్ మంచి ఆరంభం ఇచ్చాడు. దాంతో మాపై ఒత్తిడి తగ్గింది. మా ప్రదర్శన పట్ల ఆనందంగా ఉంది. కానీ.. మా బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు. మేము బౌలింగ్లో ఇంకా మెరుగవ్వాలి. తదుపరి మ్యాచ్కు పూర్తిస్థాయిలో దిగుతామనే ఆశిస్తున్నా. ఆక్లాండ్లోని సెడాన్ పార్క్లో మంచి ప్రదర్శన చేస్తాం' అని లాథమ్ తెలిపాడు.
అనుకున్నదాని కంటే తక్కువ స్కోరే:
రాస్ టేలర్ మాట్లాడుతూ... 'భారత్ బ్యాటింగ్ చూసి ఇంకా భారీ టార్గెట్ విడుస్తుందనుకున్నాం. కానీ.. మా బౌలర్లు ఇన్నింగ్స్ చివర్లో కట్టడి చేశారు. దీంతో టీమిండియా మేం అనుకున్నదాని కంటే తక్కువ స్కోరే చేసింది. బ్యాటింగ్లో లెఫ్ట్-రైట్ హ్యాండ్ కాంబినేషన్ను కొనసాగించడంతో బౌండరీలను టార్గెట్ చేయడం సులువుగా మారింది. టామ్ లాతమ్ ఇన్నింగ్స్తో నాపై ఒత్తిడి తగ్గింది. విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలనే మ్యాచ్కు ముందు ఆటగాళ్లతో చెప్పా' అని పేర్కొన్నాడు.
వన్డే చరిత్రలో అత్యుత్తమ లక్ష ఛేదన:
టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా న్యూజిలాండ్ ఒక రికార్డును నమోదు చేసింది. తన వన్డే చరిత్రలో అత్యుత్తమ లక్ష ఛేదనను ఛేజ్ చేసింది. అంతకుముందు ఆసీస్పై 347 పరుగుల ఛేదనే కివీస్కు అత్యుత్తమం. 2007లో ఇదే సెడాన్ పార్క్లో ఆసీస్పై 347 పరుగుల టార్గెట్ను కివీస్ ఛేదించింది. ఇక భారత్పై ప్రత్యర్థి జట్టు చేసిన రెండో అత్యుత్తమ ఛేజింగ్గా ఇది నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 359 పరుగుల టార్గెట్ను ఛేజ్ చేసింది.