హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ ముగిసింది. టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనను తమిళనాడు క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు. అయితే, తాజాగా తమిళనాడు క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు మరో క్రికెట్ లీగ్ సిద్దమైంది.
దాని పేరు తమిళనాడు ప్రీమియర్ లీగ్. ఈ లీగ్లో నలుగురు టీమిండియా క్రికెటర్లు అశ్విన్, దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. జులై 11 నుంచి మొదలయ్యే తమిళనాడు ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో టీమిండియా టెస్టు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ డిండిగుల్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహారించనున్నాడు.
లీగ్ ఆరంభ మ్యాచ్ల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడతాడని డిండిగుల్ డ్రాగన్స్ జట్టు యాజమాని హెచ్ఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ప్లేయర్ డ్రాఫ్ట్ జాబితాలో అశ్విన్ ఉండటంతో ఉత్తమ ఆటగాడిని జట్టులోకి తీసుకోవడానికి వీలుకలిగింది. లీగ్ తొలి మ్యాచ్లకు అతడు ప్రాతినిధ్యం వహిస్తాడని ఆయన తెలిపారు.
ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో అశ్విన్ మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని ఆయన తెలిపారు. అశ్విన్ బాధ్యతలను ఎన్ జగదీశన్ నిర్వర్తిస్తాడని చెప్పారు. మరోవైపు తమిళనాడుకు చెందిన మరికొంత మంది క్రికెటర్లు కూడా లీగ్లో సందడి చేయనున్నారు.
ప్లేయర్స్ డ్రాఫ్ట్ జాబితా నుంచి టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్ని కరైకుడి కలై జట్టు దక్కించుకోగా... టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ని రుబీ ట్రిచ్చీ వారియర్స్ సొంతం చేసుకుంది. మరోవైపు టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ని ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ గిల్లీస్ జట్టు తిరిగి సొంతం చేసుకుంది.
ఇక, అభినవ్ ముకుంద్(కోవై కింగ్స్), వాషింగ్టన్ సుందర్(టుటి పాట్రియోట్స్) జట్ల తరఫున ఆడనున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల మ్యాచ్ల కోసం భారత్ జట్టులో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ టీఎన్పీఎల్ తొలి వారం జరిగే మ్యాచ్లకు దూరం కానున్నారు.