సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా టెస్ట్ సారథి టిమ్ పైన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్ అని పేర్కొన్నాడు. కోహ్లీ ఎప్పుడూ కూడా జట్టులో ఉండటానికి ఇష్టపడే ఆటగాడిగా కనిపిస్తాడన్నాడు. భారత కెప్టెన్ సవాళ్లను స్వీకరించే ఆటగాడన్నాడు. అయితే కోహ్లీతో నాలుగేళ్ల క్రితం జరిగిన గొడవను మాత్రం తాను ఎప్పటికీ మర్చిపోనని పైన్ తెలిపాడు. కోహ్లీ మైదానంలోకి దిగాదంటే పరుగుల వరద పారాల్సిందే. పిచ్, మైదానం ఏదైనా.. బౌలర్ ఎవరైనా అతడికి తెలిసింది మాత్రం రన్స్ చేయడం ఒక్కటే తెలుసు. ఇప్పటికే 70 సెంచరీలు, 22వేలకు పైగా రన్స్ చేశాడు.
కోచ్, కెప్టెన్.. ఒక్క ఫోన్ కాల్తో సమస్యని పరిష్కరించుకోవచ్చు: దీప్దాస్
'గిల్లీ అండ్ గాస్' పోడ్కాస్ట్ షో సందర్భంగా ఆడమ్ గిల్క్రిస్ట్, టిమ్ గోసేజ్ పలు విషయాలపై మాట్లాడారు. ఇదే షోలో టిమ్ పైన్ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి సానుకూల అంశాలు చెప్పమని పైన్ను గిల్లీ, గోసేజ్ కోరారు. 'విరాట్ కోహ్లీ గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా మరోసారి చెపుతున్నా.. విరాట్ నీ సొంత జట్టులో ఉండటానికి ఇష్టపడే ఆటగాడిగా ఎప్పుడూ కనిపిస్తాడు. అతను పోటీదారుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్. అతడికి వ్యతిరేకంగా ఆడడం ఎంతో సవాలుగా ఉంటుంది. ఎందుకంటే విరాట్ గొప్ప ఆటగాడు. నాలుగేళ్ల క్రితం అతనితో గొడవ పడ్డాను. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను' అని పైన్ చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాతో టెస్టు సిరీస్ ఓటమిపాలవ్వడంపై గురువారం టిమ్ పైన్ స్పందించిన విషయం తెలిసిందే. కోహ్లీసేన తమను పక్కదారి పట్టించిందని, అందువల్లే తాము ఓడిపోయామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'పక్కదారి పట్టించడంలో భారత్ బాగుంది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో ఏకాగ్రత చెడగొడుతుంది. సిరీస్లో అలాంటి వాటికి మేం వెనకబడిన సందర్భాలు ఉన్నాయి. దీనిని ఎదుర్కోవడం సవాలే. ఇందుకో ఉదాహరణ కూడా చెబుతా. టీమిండియా ఆటగాళ్లు గబ్బాకు వెళ్లమని చెప్పారు. అప్పుడు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు. ఇలాంటి పక్కదారి పట్టించే పనుల సృష్టిలో వారు బాగున్నారు. దాంతో మేం బంతిపై దృష్టి పెట్టలేకపోయాం' అని పైన్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై గిల్లీ ప్రశ్నించగా.. తాను చెప్పినదానికి కట్టుబడి ఉన్నానన్నాడు. అయితే భారత్ తమకంటే బాగా ఆడిందని, సిరీస్ విజయానికి వారు అర్హులు అని ఆసీస్ కెప్టెన్ చెప్పాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక సచిన్ 100 సెంచరీలకు చేరువలో ఉన్నాడు. మరొక్కటి చేస్తే రికీ పాంటింగ్ సరసన చేరుతాడు.