డుప్లెసిస్ మీడియాతో మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మీడియాతో మాట్లాడుతూ "ఈ పర్యటన మాకు కఠినతరంగా మారింది. మళ్లీ భారత్కు రాబోయే పర్యటన నాటికి మా జట్టు రాటుదేలాల్సిన అవసరం ఉంది. టెస్టు సిరిస్ నెగ్గేందుకు భారత కష్టతరమైన ప్రదేశమని గణాంకాలే చెబుతున్నాయి" అని అన్నాడు.
టీమిండియా చాలా బలంగా ఉంది
"కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చాలా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లతో పాటు ఫీల్డింగ్లో కూడా టీమిండియా మాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సిరీస్లో భారత సీమర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టీమిండియా పేసర్లతో మా సీమర్లు పోటీపడలేకపోయారు. మా సీమర్లు తొలి 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ప్రభావం చూపితే, భారత సీమర్లు మాత్రం రోజంతా రాణించారు" అని డుప్లెసిస్ అన్నాడు.
బౌలర్ యొక్క నైపుణ్యం, స్వభావం
"ఇది బౌలర్ యొక్క నైపుణ్యం, స్వభావం అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ సిరిస్లో విజయవంతమైన బౌలర్లను పరిశీలిస్తే వారు కూడా ఎక్కువ సమయం సరైన ప్రాంతాల్లో బంతులను సంధించారు. దీని ఫలితంగానే మేము సిరీస్ను కోల్పోయాం. భారత బ్యాటింగ్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాం" అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
సిరిస్కు ముందు స్పిన్ బౌలింగ్ గురించి చర్చించాం!
"ఈ సిరిస్కు ముందు టీమిండియా స్పిన్ బౌలింగ్ గురించి చర్చించాం. 2015 పర్యటనను దృష్టిలో పెట్టుకుని స్పిన్ దాడికి సిద్ధం కావాలని భావించాం" అని డుప్లెసిస్ తెలిపాడు. అయితే, అందుకు భిన్నంగా టీమిండియా సీమర్లు ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేయడం విశేషం. మరోవైపు తమ జట్టులోని యువ ఆటగాళ్లు రాబోవు 3 నుంచి 4 ఏళ్లలో రాటుదేలతారని డుప్లెసిస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.