హైదరాబాద్: పరుగులు వీరులు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకున్నారు. వారిద్దరి సంభాషణపై ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. దీంతో.. ఆ ట్వీట్లు కాస్తా వైరల్గా మారాయి. ట్విటర్ వేదికగా ఉసేన్ బోల్ట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా సవాళ్లు విసురుకున్నారు. ప్యూమా షూ బ్రాండ్ ప్రచారకర్తలైన కోహ్లీ, బోల్ట్.. తమతో జత కలవబోయే కొత్త అథ్లెట్పై బెట్ వేసుకున్నారు.
ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా కొత్తగా రానున్న భారత క్రికెటర్ ఎవరో ఊహించాలని బోల్ట్కు విరాట్ సవాల్ విసిరాడు. తన ఫేవరెట్ క్రికెట్ స్పైక్స్ను బెట్గా పెట్టాడు. దీనికి వెంటనే బోల్ట్ స్పందించాడు. 'కోహ్లీ.. అతడు ఎవరో నాకు తెలుసు. నా ఫేవరెట్ రన్నింగ్ స్పైక్స్ను కూడా పందెంగా పెడుతున్నా. అతడు వేగంగా పరిగెత్తగలడు.. కానీ నా అంత కాదు. ఎవరు గెలుస్తారో వేచి చూద్దామ'ని బోల్ట్ ప్రతి సవాల్ విసిరాడు.
ప్రస్తుతం బోల్ట్ ఫుట్బాల్తో బిజీగా:
వీరి మధ్య జరుగుతున్న సరదా చాలెంజ్ను మాజీ క్రికెటర్లు స్టీఫెన్ ఫ్లెమింగ్, జాంటీ రోడ్స్ ఎంతో ఆసక్తిగా గమనించారు. అనుకున్నది సాధించడానికి కొందరు ఎంత దూరమైనా వెళతారు. ఎంత కష్టమైనా పడతారు. అథ్లెటిక్స్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ కూడా తన కల కోసం ఇప్పుడు అహర్నిశలూ శ్రమ పడుతున్నాడు. రిటైరైన తర్వాత ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆడాలన్నది బోల్ట్ కోరిక.
ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు రిటైరైన తర్వాత తన ప్రొఫెషనల్ ఫుట్బాల్ కల నెరవేర్చుకోవడానికి దేశ దేశాలు తిరుగుతున్నాడు. ప్రపంచంలోని ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ల్లో శిక్షణ పొందుతున్నాడు. ఇప్పటివరకు బోల్ట్ బొరుష్యా డార్ట్మండ్ (జర్మనీ), మమెలోడి సన్డౌన్స్ (దక్షిణాఫ్రికా), స్టామ్గాడ్సెట్ (నార్వే) జట్లతో కలిసి సాధన చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ సెంట్రల్ కోస్ మెరైనర్స్ క్లబ్తో కలిసి సాధన చేయడానికి సిద్ధమవుతున్నాడు.