హైదరాబాద్: స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఆసీస్ సంస్కృతిని దెబ్బతీసిందని మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆవేదన వ్యక్తం చేశాడు. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బాన్క్రాప్ట్ బాల్ టాంపరింగ్కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్ల తీరుపై అటు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
సఫారీ గడ్డపై ఆసీస్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్కు పాల్పడిన ఘటన తనను ఎంతగానో కలచివేసిందని అన్నాడు. తాజాగా ఈ బాల్ టాంపరింగ్ వివాదంపై స్టీవ్ వా మాట్లాడుతూ 'గత వారం కేప్టౌన్లో చోటు చేసుకున్న ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్లో ఫాలో అవుతున్న నా అభిమానులు దీనిపై నాకు ఎన్నో వేల మెసేజ్లు పంపారు. వారు ఎంత బాధపడుతూ ఆ మెసేజ్లు చేశారో వాటిని చదివితే అర్ధమైంది' అని అన్నాడు.
'ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్లో విజయం సాధించాలన్న తపనతోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఉంటుంది. ఔను ఇది నిజమే. 'కానీ, బాల్ టాంపరింగ్ లాంటి చర్యలకు పాల్పడి మాత్రం ఎప్పుడూ గెలవాలనుకోదు. పోరాటపటిమ, నైపుణ్యంతో.. మంచి క్రికెట్ ఆడి, చివరి వరకు పోరాడి విజయం కోసం యత్నిస్తుంది. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కూడా ఇలాంటి సంస్కృతే ఉందని భావిస్తున్నాను. కానీ, జట్టులో కొంత మంది దీనిని దెబ్బతీశారు' అని వా ఆవేదన వ్యక్తం చేశాడు.
'2003లో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ రూపొందించిన 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అనే డాక్యుమెంట్లో మార్పులు చేశాం. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మరింత స్వేచ్ఛగా ఆడతారని భావించాం. కానీ, అలా జరగడం లేదు. ఆటగాళ్లు తప్పుదోవ పడుతున్నారు. ఇందుకోసం ఆ డాక్యుమెంట్ను మరోసారి ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది' అని అన్నాడు.
'భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా, క్రికెట్ ప్రతిష్ట దెబ్బతినకుండా, క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే వారికి స్ఫూర్తిగా, క్రికెట్నే తమ శ్వాసగా భావించే అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఆ మార్పులు ఉండాలి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఆటగాళ్ల సామాజిక, మానసిక స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని స్టీవ్ వా సూచించాడు.
'క్రికెట్ మెరుగైన ఫలితాన్ని సాధించేందుకు గాను తన వంతుగా అన్ని సానుకూల చర్యలకు మద్దతు ఇస్తాను. క్రికెట్ను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్క అభిమాన్ని మనం తిరిగి మల్లీ పొందాలి' అని స్టీవ్ వా అన్నాడు.