సందేహం లేదు, ధోని జట్టులో సభ్యుడే: కోహ్లీ ప్రశంస


హైదరాబాద్: తనపై వస్తోన్న విమర్శలకు ఎప్పటికప్పుడు తన ఆటతీరుతో సమాధానం చెప్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో ధోని విమర్శలను ఎదుర్కొంటోన్న సంగతి తలిసిందే. ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో ధోని 96 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ అతడిపై విమర్శలు ఆగలేదు.
ఎప్పుడో ఒకసారి బాగా ఆడడం కాదు.. టీమిండియాను గెలిపించేలా ఆడాలి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, మంగళవారం అడిలైడ్ వేదికగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి, తనను విమర్శిస్తున్న వారు సైతం ప్రశంసించేలా చేసుకున్నాడు. దీంతో 'ధోనీ లేకపోతే గెలిచేవాళ్లమా?' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సరైన సమయంలో
"సరైన సమయంలో తన సత్తా ఏంటో చూపించాడు. విజయం కోసం అందరం కష్టపడ్డాం. ఇది మాకు ప్రత్యేకమైన రోజు. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో మేం ఆసీస్ను కట్టడి చేశాం. మ్యాక్స్వెల్, మార్ష్ల వికెట్లు పడగొట్టిన ఆ రెండు బంతులు అద్భుతం. బంతితో భువీ చాలా బాగా రాణించాడు. అతను ఫామ్లోకి వచ్చి మాకు అండగా నిలిచాడు" అని కోహ్లీ అన్నాడు.

అద్భుత ప్రదర్శన
"చివర్లో ధోని-కార్తీక్ జోడీ అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి సమయంలో బ్యాటింగ్కు వచ్చిన కార్తీక్ బాగా రాణించాడు. ఈ రోజు మాకు చాలా కఠినంగా గడిచింది. ఉక్కపోతతో మా దుస్తులు ఉప్పుతో నిండిపోయాయి. తీవ్రంగా అలసిపోయాం. విరామాన్ని ఆస్వాదించి చివరి మ్యాచ్కు సిద్ధమవుతాం" అని కోహ్లీ పేర్కొన్నాడు.

రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
మూడు వన్డేల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్లో ధోని ఫినిషింగ్ టచ్తో విజయం భారత్నే వరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్మెన్ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు.

షాన్ మార్ష్ సెంచరీ
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ, మాక్స్వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలమయ్యాడు.

1-1తో సిరిస్ సమం
వికెట్ ఏమీ తీయకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications