మొత్తం 36: వన్డేల్లో విరాట్ కోహ్లీ చేసిన ఐదు అత్యుత్తమ సెంచరీలివే

హైదరాబాద్: ఛేజ్ మాస్టర్... రన్ మెషిన్ ఇలా ఎన్ని పేర్లతో అభిమానులు ముద్దుగా పిలుచుకున్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తక్కువే. క్రీజులో అడుగుపెట్టాడంటే చాలు దూకుడుగా ఆడాల్సిందే. పరుగుల వరద పారించాల్సిందే. ఆదివారం గువహటి వేదికగా విండిస్తో జరిగిన తొలి వన్డేలో ఇన్నింగ్స్ 27వ ఓవర్లో బౌండరీతో కోహ్లీ తన 36వ సెంచరీని సాధించాడు.
ఈ ఏడాది కోహ్లీకి ఇది నాలుగో వన్డే సెంచరీ కావడం విశేషం. 386 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. సచిన్కన్నా 40 ఇన్నింగ్స్లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో 36, టెస్టుల్లో 24 సెంచరీలతో ఉన్న ఈ విరాట్ కోహ్లీ మొత్తంగా 60 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (100), పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62) ముందున్నారు.
గువహటి వన్డేలో కోహ్లీ సాధించిన సెంచరీ ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది. ఇక, కెప్టెన్గా కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 14. 50 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ (22) తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. పాంటింగ్ 220 ఇన్నింగ్స్ల్లో ఈ సెంచరీలు చేశాడు.
ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్లో ఐదు అత్యుత్తమ వన్డే సెంచరీలు మీకోసం...

1. 133 Vs శ్రీలంక, 2012
హోబర్ట్లోని బ్లండ్ స్టోన్ ఏరెనా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముక్కోణపు సిరిస్ ఫైనల్లోకి చేరుకోవాలంటే శ్రీలంకపై టీమిండియా బోనస్ పాయింట్ తేడాతో విజయం సాధించాలి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోవడంతో ఫైనల్ బెర్తు ఖాయమనుకుని ధీమాగా ఉంది. టీమిండియాకు బోనస్ పాయింట్ రావాలంటే 40 ఓవర్లలోపే ఈ భారీ లక్ష్యాన్ని చేధించాలి. క్రీజులోకి వచ్చిన కోహ్లీ శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడటంతో టీమిండియా 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 133 పరుగులు చేశాడు. లసిత్ మలింగ వేసిన ఓ ఓవర్లో కోహ్లీ 24 పరుగులు పిండుకున్నాడు.

2. 183 Vs పాకిస్థాన్, 2012
హోబర్ట్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కొన్ని వారాల తర్వాత విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఈ సెంచరీ వెలువడింది. ఢాకా వేదికగా జరిగిన ఆసియా కప్లో పాకిస్థాన్ 329 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 183 పరుగులు చేయడంతో రెండు ఓవర్లు మిగిలుండగానే టీమిండియా విజయం సాధించింది. ఈ కీలక ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లీ తనలోని ఆటను మరింతగా మెరుగుపరచుకున్నాడు.

3. 122 Vs ఇంగ్లాండ్, 2017
స్వదేశంలో పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 122 పరుగులు నమోదు చేశాడు.

4. 115 Vs ఆస్ట్రేలియా, 2013
ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాట్స్మెన్ జార్జి బెయిలీ, షేన్ వాట్సన్ సెంచరీలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు తొలి వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 20 ఓవర్లలో భారత విజయానికి 173 పరుగులు అవసరమయ్యాయి. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ 66 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

5. 107 Vs పాకిస్థాన్, 2015
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ భారీ లక్ష్యం సాధించడంలో కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 126 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 107 పరుగులు సాధించాడు. కోహ్లీ సెంచరీతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్, సురేశ్ రైనా రాణించడంతో టీమిండియా 301 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ను మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీసి బోల్తా కొట్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications