ఆన్లైన్ ఓటింగ్ టోర్నీ:
కరోనా వైరస్ కారణంగా భారత్లో గత మార్చి చివర నుంచి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో ఐపీఎల్ 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే అభిమానులను ఆకట్టుకునేందుకు ఆర్సీబీ జట్టు ఓ వినూత్న టోర్నీకి శ్రీకారం చుట్టింది. 55 రోజుల పాటు ఆన్లైన్లో ఓటింగ్ పద్ధతిలో ఓ ఈవెంట్ను నిర్వహించి.. దానికి 'ఇండియన్ పోలింగ్ లీగ్' అని నామకరణం చేసింది. అలా అన్ని జట్ల మధ్య ప్రతీరోజూ ఓటింగ్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించి విజేతలను ప్రకటించింది.
సన్రైజర్స్పై భారీ విజయం:
ఐపీఎల్ లాగే ఈ టోర్నీలోనూ లీగ్లు, ఫ్లేఆఫ్లు నిర్వహించింది ఆర్సీబీ. ఏ జట్టుకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ జట్టును విజేతగా ప్రకటించింది. ఇలా షెడ్యూల్ ప్రకారం జరిగాల్సిన మ్యాచ్లకు పోల్ నిర్వహించి ఇండియన్ పోల్ లీగ్ను ఆర్బీబీ ఫైనల్ వరుకు నిర్విరామంగా కొనసాగించింది. అలా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫైనల్కు చేరాయి. ఇక సోమవారం హరిజన ఫైనల్లో ఆర్సీబీ 85 శాతం ఓట్లతో విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని ఆర్బీబీ ట్విటర్లో వెల్లడించింది. ఈ అంతేకాదు ఇన్ని రోజులు తమకు ఓట్లు వేసి గెలిపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
ఈ సారి కప్పు మీదే:
ట్విటర్లో ఆర్బీబీ పోస్ట్ చూసిన చెన్నై సూపర్ కింగ్స్ 'విజిల్ పోడు' అనే కామెంట్ పెడుతూనే ఆర్సీబీని ట్రోల్ చేసింది. ఈ సాలా కప్ నమ్దే (ఈ సారి కప్పు మీదే) అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్న ఫొటోను జతచేసింది. మరోవైపు ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాగైనా కప్ గెలిచాం అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. విషయం తెలియని కొందరు షాక్ అవుతున్నారు.
ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు:
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అయినా ఆర్సీబీ అభిమానులు ఆ జట్టుకు అండగా ఉండడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మూడుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే చెన్నై జట్టు.. బెంగుళూరును సరదాగా ఆటపట్టించింది.
ఐపీఎల్ను నిర్వహించే అవకాశాలు:
కరోనా వైరస్ కారణంగా ఈసారి వాయిదా పడ్డ ఐపీఎల్ 2020ని బీసీసీఐ అధికారులు అక్టోబర్-నవంబర్లో నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టత లేకున్నా.. టీ20 ప్రపంచకప్ను వాయిదా వేసి ఐపీఎల్ను నిర్వహించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ కీలక సమావేశాలు జరుగబోతున్నాయి కాబట్టి ఏదోఒక విషయం తేలనుంది.