సుదీర్ఘ ఫార్మాట్ను తిప్పేసిన బౌలర్లు
సుధీర్ఘ ఫార్మాట్ను శాసిస్తూ ఆఫ్ స్పిన్నర్లు దిల్రువన్ పెరీరా, నాథన్ లియాన్ ఇద్దరూ ఈ ఏడాది చెరో 48 వికెట్లు తీయగలిగారు. ఈ క్రమంలోనే శ్రీలంకకు చెందిన పెరీరా 10 టెస్టుల్లో 48 వికెట్లు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జూలైలో గాలేలో జరిగిన తొలి టెస్టులో 6/32తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతని దెబ్బకు సఫారీ జట్టు 28.5 ఓవర్లలో 73 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్ను 278 పరుగుల తేడాతో శ్రీలంక చేజిక్కుంచుకుంది. ఇక లియాన్ 9 మ్యాచుల్లో 48 వికెట్లు తీశాడు. డిసెంబర్లో అడిలైడ్లో భారత్తో జరిగిన తొలి టెస్టులో 6/122తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహరాజ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచిపోయాడు. కగిసో రబాడా కారణంగా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. జూలైలో కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మహారాజ్ 9 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యుత్తమ గణాంకాలు (9/129) నమోదుచేసిన రెండో బౌలర్గా మహరాజ్ నిలిచాడు. అంతేకాకుండా తొమ్మిది వికెట్లు తీసిన రెండో లెఫ్ట్ ఆర్మ ఆర్థోడాక్స్ బౌలర్గానూ కేశవ్ రికార్డు సాధించాడు.
వన్డేల్లో సత్తా చాటిన హీరోలు:
అఫ్ఘనిస్తాన్ బౌలింగ్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ వన్డేల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 24 వరకు మొత్తం 20 మ్యాచ్లు ఆడి 48 వికెట్లు తీశాడు. ఫిబ్రవరిలో జింబాబ్వేతో షార్జాలో జరిగిన వన్డేలో 5/24తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సత్తా చాటాడు.
బౌలింగ్ ప్రదర్శనతో పాటు వికెట్లు తీయడంలోనూ వన్డే బౌలర్లు బాగా రాణించారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, భారత బౌలర్ కుల్దీప్ యాదవ్, శ్రీలంకకు చెందిన అకిల ధనంజయ.. వీరు ముగ్గురూ ఈ ఏడాది ఒక మ్యాచ్లో ఆరేసి వికెట్లు తీశారు. కానీ, పరుగుల అదుపుచేసిన విషయంలో తాహిర్దే పైచేయిగా నిలిచింది. అక్టోబర్ 3న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తాహిర్ కేవలం 6 ఓవర్లలో 6/24 గణాంకాలు నమోదు చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. తాహిర్ దెబ్బకు జింబాబ్వే 78 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 120 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు, కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 6 వికెట్లు తీసి 25 పరుగులిచ్చి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
షార్ట్ ఫార్మాట్ను సెన్సేషనల్గా ముగించి
ఆస్ట్రేలియన్ మీడియం పేసర్ ఆండ్రూ టై ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మొత్తం 19 మ్యాచ్లు ఆడిన టై 31 వికెట్లు తీశాడు. ఫిబ్రవరిలో సిడ్నీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 4/23తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), భువనేశ్వర్ కుమార్ (ఇండియా), కుల్దీప్ యాదవ్ (ఇండియా) ఐదు వికెట్లు తీసిన ఘనత దక్కించుకున్నారు. షకీబ్ (5/20)తో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ 20న ఢాకాలో వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో షకీబ్ ఐదు వికెట్లు తీసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.