హైదరాబాద్: టీ 20 అంటే గుర్తొచ్చేది బౌండరీలు, అదిరిపోయే షాట్లు, అద్భుతమైన విజయాలు.. కానీ, అంతర్జాతీయ టీ 20 క్రికెట్ మ్యాచ్లో జట్టులోని ప్లేయర్లంతా కేవలం సింగిల్ డిజిట్కే పరిమితవడం దారుణమైన విషయం. ఇలాంటి ఘటనే ఒకటి మలేసియా వేదికగా చోటు చేసుకుంది. మలేసియా వేదికగా మహిళల ఆసియా కప్ జరుగుతోంది. అక్కేడే జరుగుతున్నా.. కనీస పరుగులు కూడా సాధించలేకుండా.. ఇంత తక్కువగా పరుగులతో ఆతిథ్య మలేసియా పరువు కాపాడుకోలేకపోయింది.
టోర్నీలో భాగంగా బుధవారం థాయ్లాండ్-మలేసియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన మలేసియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి బంతికే ఓపెనర్ యాకప్ పెవిలియన్ బాటపట్టింది. ఇక్కడితో మొదలైన వారి వికెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. పరుగులు రాబట్టడంలో మలేసియా క్రికెటర్లు విఫలమయ్యారు. దీంతో బ్యాటింగ్ దిగిన క్రీడాకారిణిలందరూ సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమై వెనుదిరిగారు. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మలేసియా ఇన్నింగ్స్ మొత్తం మీద ఒకే ఒక్క బౌండరీ నమోదైంది.
సషా అజ్మి 13 బంతుల్లో 9 పరుగులు చేసింది. ఇందులో ఒక ఫోర్ ఉంది. ఈ 9 పరుగులు సాధించిన అజ్మినే జట్టులో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇంతకీ మలేసియా జట్టు నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు చేసిన స్కోరు 8 వికెట్ల నష్టానికి 36 పరుగులు. ఇందులో రెండు పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చినవే. స్వల్ప లక్ష్యాన్ని థాయ్లాండ్ జట్టు వికెట్ నష్టానికి 9 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్లో థాయ్లాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు భారత్తో జరిగిన మ్యాచ్లో కూడా మలేసియా ఘోర పరాజయం మూటకట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 169 పరుగులు సాధించగా.. లక్ష్య ఛేదనలో మలేసియా 27 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టంతా కష్టపడి 46 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో 90 పరుగల తేడాతో లంక గెలుపొందింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన ఆతిథ్య మలేసియా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకోలేకపోయింది.