
రోహిత్, విరాట్ గైర్హాజర్..
ఎల్లుండి మొదలు కానున్న కాన్పూర్ టెస్ట్ కూర్పు అనూహ్యంగా ఉంటోంది. భారత జట్టు టీ20 ఫార్మట్ కేప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.. ఈ సిరీస్కు దూరం అయ్యాడు. కాన్పూర్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా ఆడట్లేదు. రెండో టెస్ట్కు అతను అందుబాటులో ఉంటాడు. దీనికోసం నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. ముంబైలోని బ్రాబర్న్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడు. రెండో టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ డెబ్యూ
విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అజింక్య రహానె.. ఈ తొలి టెస్ట్కు కేప్టెన్గా వ్యవహరిస్తాడు. శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా అతను వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్కే పరిమితం అయ్యాడు. ఇక న్యూజిలాండ్పై కాన్పూర్లో తలపడే టీమిండియా తుది జట్టులో అతనికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీ20, వన్డే ఫార్మట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్గా పేరు తెచ్చుకున్న శ్రేయాస్.. ఇక టెస్టుల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది.

దక్షిణాఫ్రికా టెస్ట్ స్క్వాడ్ త్వరలో..
న్యూజిలాండ్తో సిరీస్ ముగిసిన వెంటన టీమిండియా.. దక్షిణాఫ్రికా విమానం ఎక్కనుంది. మరో సుదీర్ఘమైన సిరీస్ ఆడనుంది. జనవరిలో ఈ సిరీస్ మొదలవుతుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లే జట్టు కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ.. రంగంలో దిగనుంది. కాన్పూర్ టెస్ట్ ముగిసిన తరువాత.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును ఎంపిక చేయనుంది. న్యూజిలాండ్తో ఆడే రెండో టెస్ట్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు లేవు. సఫారీ టూర్ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేస్తుంది.

కోన భరత్కు ఛాన్స్..
వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్ దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అతను న్యూజిలాండ్తో ఆడబోయే తొలి టెస్ట్ కోసం జట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్టులో ఉంటాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. వృద్ధిమాన్ సాహాకు ప్రత్యామ్నాయంగా భరత్ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. తొలి టెస్ట్లో అతనికి ఆడే అవకాశం వస్తే.. తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఓ మోస్తరుగా ఆడినా.. దక్షిణాఫ్రికా టూర్ కోసం బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే.

తొలి టెస్ట్ స్క్వాడ్ ఇదే
ఎల్లుండి కాన్పూర్లో ఆరంభం అయ్యే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానె (కేప్టెన్), కేఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ను టెస్ట్ స్క్వాడ్గా ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. తొలిమ్యాచ్లో కేఎస్ భరత్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












