

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం తనకు లభించిన విశ్రాంతిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉండే విరాట్ కోహ్లీ శుక్రవారం ట్విటర్లో అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ముంబైలో కొత్తగా నిర్మించిన తన ఇంటి బాల్కనీలో దిగిన ఫొటోను అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేశాడు. 'ఇంటి నుంచి ఇంత అద్భుమైన వీక్షణం ఎక్కడైనా.. ఎప్పుడైనా ఉండాలిని కోరుకోకుండా ఉండగలరా? అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం కొద్దిరోజుల క్రితమే ముంబై వచ్చిన విరాట్ కోహ్లీ గత ఆదివారం భోపాల్ నుంచి ముంబైకి చేరుకున్న అనుష్క శర్మను విరాట్ కోహ్లీ స్వయంగా ఎయిర్పోర్టుకి వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా బోనీ కపూర్ ఇంటికి వెళ్లి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ఈ జంట సన్నిహితుల పెళ్లికి హాజరైంది. ఈ పెళ్లి వేడుకలో ఫేమస్ హిందీ పాట 'కజ్రా రే' పాటకు స్టెప్పులతో అదరగొట్టాడు. కోహ్లీ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అయిన అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలా విరాట్ ఏ వేడుకకి హాజరైనా తనదైన శైలిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటాడు.
తన పెళ్లి వేడుకలోనూ అనుష్కతో కలిసి విరాట్ డ్యాన్స్ చేశాడు. గతేడాది డిసెంబర్లో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు ఇటలీలో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జోడీ ఢిల్లీ, ముంబైలలో రిసెప్షన్లను సైతం ఇచ్చారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్లో రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఇక, ముంబైలో ఇచ్చిన రిసెప్షన్లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రికెటర్లు హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న నిదాహాస్ ట్రోఫీకి కోహ్లీతో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లకు సెలక్టర్లు విశ్రాంతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.