ఇదేం సెలెక్షన్?
టీమిండియా సెలెక్షన్ను తప్పుబట్టిన చోప్రా.. నిలకడలేని సెలెక్షన్ వల్ల జట్టుకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. 'గత ఏడాదిగా కొనసాగుతున్న సమస్య టీం సెలెక్షన్. ఇప్పటికైనా మారుతుందని ఆశిస్తున్నా. ఈ సెలెక్షన్లో ఏమాత్రం లాజిక్ లేదు. సెలెక్షన్ ప్రక్రియ స్థిరంగా లేకపోతే నిలకడ ఎలా ఉంటుంది? సరైన ఆటగాళ్లను రెగ్యులర్గా తీసుకోకపోతే.. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే కదా' అని ఆకాష్ చోప్రా అన్నాడు.
బిష్ణోయి గుర్తున్నాడా..
తన వాదనకు బలం చేకూర్చడానికి రవి బిష్ణోయిని ఉదాహరణగా చూపించాడు చోప్రా. 'ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ గుర్తుతెచ్చుకోండి. ఆ మ్యాచ్లో రవి బిష్ణోయి చక్కగా ఆడాడు. అంతకుముందు వెస్టిండీస్పై కూడా రాణించాడు. ఇంత బాగా రాణిస్తున్న అతను వరల్డ్ కప్ స్టాండ్బై ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. కానీ న్యూజిల్యాండ్ వెళ్లిన జట్టులో తను లేడు. సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా బిష్ణోయి తొలి వన్డే ఆడాడు. కానీ కివీస్, బంగ్లా పర్యటనల్లో అతను లేడు' అన్నాడు.
సడెన్గా గుర్తొచ్చారు..
న్యూజిల్యాండ్ పర్యటనకు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ను పంపించారని, వాళ్లను మళ్లీ బంగ్లాదేశ్కు పంపలేదని చోప్రా చెప్పాడు. ఇలా ఒక ప్లాన్ లేకుండా సెలెక్షన్ ప్రక్రియ సాగుతోందన్నాడు. షమీ, అశ్విన్ను టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయడాన్ని కూడా ఎత్తి చూపాడు. 'ఏడాది పాటు వీళ్లిద్దర్నీ పట్టించుకోలేదు. కానీ సడెన్గా వాళ్లను గుర్తు చేసుకున్నారు. ఏడాదిగా హర్షల్ పటేల్ను ఆడించి, చివరకు అతన్ని ఎంపిక చేసినా ఆడించే సాహసం చేయలేకపోయారు' అని విమర్శించాడు.
సెలెక్షన్ అసలు బాగలేదు..
సెలెక్టర్ల ఆలోచనలు బాగలేవని లేదా వాటిని సరిగా అమలు చేయడం లేదని చోప్రా అన్నాడు. ఈ సెలెక్షన్ విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, తాము ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలని సూచించాడు. ఇలాగే జట్టును ఎప్పటికప్పుడు మార్చేస్తూ పోతే జట్టులో స్థిరత్వం లేకుండా పోతుందని, అప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయని, అప్పటి వరకు నమ్మిన సిద్ధాంతాన్నే తప్పుబట్టాల్సి వస్తుందని అన్నాడు.