అహ్మదాబాద్: టీమిండియా యువ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్లో అరుదైన ఘనత సాధించాడు. కెరీర్లో ఆడిన తొలి 6 వన్డే మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్లో కనీసం 30 పరుగులకు పైగా స్కోర్ చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. తన కెరీర్లో అరంగేంట్ర వన్డే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లోనే 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత రెండో వన్డే మ్యాచ్లో అర్ధ శతకం సాధించాడు. 44 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఇక కెరీర్లో ఆడిన మూడో వన్డే మ్యాచ్లో 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనలో ఆ జట్టుతో ఆడిన కెరీర్ నాలుగో వన్డే మ్యాచ్లో 32 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్లో వెస్టిండీస్తో ఆడిన తొలి వన్డే అతని కెరీర్లో ఐదవది. ఆ మ్యాచ్లో 36 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇక నేడు వెస్టిండీస్తో ఆడిన రెండో వన్డే మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్లో ఆరవది. ఈ మ్యాచ్లో 64 పరుగులు సాధించాడు. తద్వారా తన కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. దీంతో కెరీర్లో ఆడిన తొలి ఆరు వన్డే మ్యాచ్లలో ప్రతి మ్యాచ్లో కనీసం 30 పరుగులకు పైగా చేసిన బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు తన కెరీర్లో ఆడిన 6 వన్డేల్లో యాదవ్ 65 సగటుతో 261 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో సూర్యపై మాజీ ఆటగాళ్లతోపాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా నేడు వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటాడు. 43 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. కేఎల్ రాహుల్తో కలిసి నాలుగో వికెట్కు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రాహుల్ ఔటైనప్పటికీ దీపక్ హుడాతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 83 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్.. 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.