హైదరాబాద్: సఫారీ పర్యటనలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం కేప్ టౌన్లోని న్యూలాండ్స్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
పాక్లో సెంచరీ కొట్టలేడు: కోహ్లీకి ఛాలెంజ్ విసిరిన కోచ్ ఆర్ధర్
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ సఫారీ గడ్డపై కోహ్లీసేన ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఆరు వన్డేల సిరిస్లో దక్షిణాఫ్రికాను భారత మణికట్టు స్పిన్నర్లు కట్టడి చేస్తున్న తీరుని ఆయన కొనియాడాడు.
'ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. రోహిత్ శర్మ ఫామ్పై ఆందోళన అవసరం లేదు. కొత్త బంతిని ఎలా ఎదుర్కొవాలో అతడికి బాగా తెలుసు. మూడో వన్డేలో రోహిత్ శర్మ రాణిస్తే ఈ సిరిస్ మనదే' అని గంగూలీ పేర్కొన్నాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 1-2తో చేజార్చుకున్న తర్వాత కోహ్లీసేన పుంజుకున్న తీరు అద్భుతమని పేర్కొన్నాడు.
సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించగల సత్తా కోహ్లీసేనకు ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత మణికట్టు స్పిన్నర్లు అయిన యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లను ఎదుర్కొనేందుకు సఫారీలు ఇబ్బంది పడుతున్నారని, ఆ జట్టు స్టార్ ప్లేయర్లు డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్లు దూరమవ్వడం కోహ్లీసేనకు కలిసొస్తుందని అన్నాడు.
ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఈ మణికట్టు స్పిన్నర్లు ఇద్దరూ 13 వికెట్లు తీశారు. సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో వీరిద్దరూ 8 వికెట్లు తీసి 42 పరుగులిచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో మూడో వన్డేకు ముందు నెట్స్ ప్రాక్టీస్లో భాగంగా సఫారీలు ఐదుగురు మణికట్టు స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేశారు.
19 ఏళ్ల క్రితం: ఒకే మ్యాచ్ లో పదికి పది వికెట్లు పడగొట్టిన కుంబ్లే
దీనిని బట్టి సఫారీలను వీరిద్దరూ ఎంతగా ఇబ్బంది పెట్టారో తెలుస్తోంది. ముఖ్యంగా భారత మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్ను చదవడంలో సఫారీ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారని దాదా చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టులో కూడా ఒక మణికట్టు స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ రూపంలో ఉన్నప్పటికీ, భారత్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో విఫలమవుతున్నాడని అన్నాడు.
'టెస్టు సిరిస్ తర్వాత భారత చక్కటి ప్రదర్శన చేస్తోంది. దక్షిణాఫ్రికాను ఓడించగలమని వారు నమ్మడమే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. టెస్టు సిరిస్లో దక్షిణాఫ్రికా తెలివిగా స్పిన్నర్లను ఆడించలేదు' అని గంగూలీ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.