న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫునే బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ రైనాను రిటైన్ చేసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి రైనా అర్దాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. జట్టుతో దుబాయ్లో అడుగుపెట్టిన రైనా.. టీమ్మేనేజ్మెంట్తో తలెత్తిన విభేధాలతోనే భారత్కు తిరిగొచ్చాడనే ప్రచారం జరింగింది. కానీ రైనా గైర్హాజరీలోని సీఎస్కే చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో వచ్చే సీజన్కు జట్టులో ప్రక్షాళన చేయాలని భావించిన సీఎస్కే టీమ్మేనేజ్మెంట్ ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం సిద్దమవుతుంది. ఫిబ్రవరి రెండో వారంలో వచ్చే సీజన్కు సంబంధించిన మినీ వేలం జరిగే సూచనలు కన్పిస్తున్నాయ్. దీంతో జనవరి 21 లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ప్లేయర్ల జాబితాను సమర్పించాలని అన్ని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. ఇక సీఎస్కే తమ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాను రిటైన్ చేసుకోవాలనుకుంటుందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
వచ్చే సీజన్లో కూడా జట్టును ధోనీనే నడిపిస్తాడని ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ తెలిపాడు. 'సురేశ్ రైనా, ధోనీలను రిటైన్ చేసుకుంటాం. వచ్చే సీజన్లో కూడా ధోనీనే సారథిగా ఉంటాడు. హర్భజన్ సింగ్తో సహా కొంత మంది ఆటగాళ్లను వదులుకోవాలనుకుంటున్నాం'అని సదరు అధికారి తెలిపాడు.
గత సీజన్లో దారుణంగా విఫలమైన కేదార్ జాదవ్, పీయూష్ చావ్లా, మురళీ విజయ్లను వదులుకునే యోచనలో ఉన్నామని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. రిటైన్, వదులుకునే ఆటగాళ్ల జాబితాపై బుధవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చెన్నైతో తన ఒప్పందం ముగిసిందని హర్భజనే ప్రకటించాడు.