ముంబై: వన్డే క్రికెట్లో లక్ష్యాలను ఎలా ఛేదించాలో, విజయాలను ఎలా సాధించాలో భారత జట్టుకు నేర్పింది మాజీ కోచ్ గ్రేగ్ చాపెలేనని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. తన ఆత్మకథ 'బిలీవ్'బుక్ను సోమవారం విడుదల చేయనున్న రైనా.. ఈ సందర్భంగా ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జట్టు వాతావారణాన్నే చాపెల్ మార్చేశాడని గుర్తు చేసుకున్నాడు. ధోనీ, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లను అతనే జట్టులోకి తీసుకొచ్చాడని, యువ ఆటగాళ్లతో జట్టు డెవలప్ చేశాడన్నాడు.ఇక తన కెరీర్ ఆరంభంలో డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉండేదో కూడా రైనా చెప్పుకొచ్చాడు. ఓ సీనియర్ ప్లేయర్ తనను కించపర్చాడని కూడా ఈ మాజీ బ్యాట్స్మన్ గుర్తు చేసుకున్నాడు.
'ఓ సీనియర్ ప్లేయర్ నన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడినట్లు నాకు గుర్తుంది. 'నువ్వుక్కడివే మ్యాచ్ ఆడుతున్నట్లు తెగ ప్రాక్టీస్ చేస్తున్నావు.'అని సదరు సీనియర్ ప్లేయర్ నన్ను ఎద్దేవా చేశాడు. నేను వెంటనే నాతో కలిసి ప్రాక్టీస్ చేయమని కోరా. ఎందుకంటే ఒకరిని బాధపెట్టడం నాకు నచ్చదు. ఇక ర్యాగింగ్ను డీల్ చేయడం కొత్త కాదు. ఎందుకంటే నా హాస్టల్ లైఫ్లో ఎన్నోసార్లు వాటిని ఎదుర్కొన్నా. అయితే సీనియర్ ఆటగాళ్లు జూనియర్స్ను ర్యాంగింగ్ చేసేవారని చెప్పడం లేదు. ర్యాగింగ్ అంటే ఏంటో నాకు తెలుసు. కొన్ని విషయాల్లో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు భిన్నంగా ప్రవర్తించేవారు. కొంత మందికి మేం విష్ చేస్తే కనీసం తిరిగి విష్ చేసేవారు కాదు. కానీ ఏనాడు నేను దానికి బాధపడింది లేదు.'అని రైనా మిడ్డే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
గ్రేగ్ చాపెల్పై రైనా ప్రశంసల జల్లు కురిపించాడు.'గ్రేగ్ చాపెల్ కోచింగ్ కెరీర్ వివాదాల మయం కావొచ్చు. కానీ విజయాల ఎలా సాధించాలో టీమిండియా అతను నేర్పించాడు. విజయం ప్రాముఖ్యతను బోధించాడు. నిజానికి మేమంతా అప్పుడు బాగా ఆడుతున్నాం. చేజింగ్లో బ్యాటింగ్, భాగస్వామ్యాల గురించి అతను నొక్కి చెప్పడం నాకు గుర్తుంది'అని రైనా తెలిపాడు.
భారత క్రికెట్లో చాపెల్, గంగూలీ విభేదాల గురించి అందరికి తెలిసిందే. కాగా చాపెల్ కోచింగ్లోనే రైనా అరంగేట్రం చేశాడు. చాపెల్ కోచింగ్లో భారత్ వరుసగా 17 మ్యాచ్లను చేజింగ్లో గెలవడం ప్రత్యేకం.