
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో రైనా రాణించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ట్విట్టర్ వేదికగా అతని గురించి పలు క్రీడా ప్రముఖులు చర్చిస్తున్నారు. 'భారత్ సిరీస్ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన రైనా పునరాగమనం అదిరింది' అని మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. స్పెషల్ షూటౌట్తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన రైనాకు అభినందనలు' అని సచిన్ పేర్కొన్నాడు. 'రైనా అద్భుతంగా ఆడావు' అంటూ పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ట్వీట్ చేశాడు.
రైనా భార్య ప్రియాంక అతని ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు. 'నీ హృదయం భావోద్వేగంతో నిండిపోయి ఉంటుంంది. నీ కళ్లలో ఆనంద భాష్పాలు వర్షించి ఉంటాయి' అని ఆమె ట్వీట్ చేశారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ టెస్టు, వన్డే సిరీస్ల అనంతరం సురేశ్ రైనాను జట్టులోకి ఆహ్వానించింది. ఏడాదిపాటు నిరీక్షించిన రైనా సఫారీలతో మూడు టీ20ల సిరీస్ ద్వారా భారత జట్టులోకి తిరిగి ప్రవేశించాడు. ప్రధానంగా చివరి టీ 20లో రైనా తనదైన మార్కుతో చెలరేగి ఆడాడు.
27 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 43 పరుగులు సాధించాడు. మరొకవైపు బౌలింగ్లో సత్తా చాటుకున్నాడు. ఒకవైపు ప్రధాన బౌలర్లు భారీగా పరుగులిచ్చిన తరుణంలో రైనా మాత్రం పొదుపుగానే బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 27 పరుగులతో సరిపెట్టుకున్నాడు. డేవిడ్ మిల్లర్ వంటి ప్రమాదకర బ్యాట్స్మన్ వికెట్ను సైతం తన ఖాతాలో వేసుకుని భేష్ అనిపించాడు. ఇవన్నీ భారత విజయానికి బాటలు వేశాయి.
తొలి టీ20లో 7 బంతుల్లో 15 పరుగులు చేసిన రైనా.. రెండో టీ20లో 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ మూడు మ్యాచ్ల్లోనూ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు దిగిన రైనా.. వచ్చీ రావడంతోనే సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారిని ఒత్తిడికి గురి చేశాడు. అటు కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని, ఇటు సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలిగాడు. ఇలా పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా రైనాకు అభినందలు తెలియజేస్తున్నారు.