బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది:
తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'బీసీసీఐకి అభినందనలు. చాలా మంచి నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యం. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో.. ఈ సమయంలో ఈ నిర్ణయం ఎంతో అవసరం. ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు వేలాది మంది వస్తారు. హోటల్స్, ఎయిర్పోర్టులలో అనేక మంది ఉంటారు. చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఎవరైనా వైరస్ బారిన పడొచ్చు. వాళ్ల నుంచి ఇతరులకు వ్యాపించొచ్చు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైంది' అని అన్నారు.
ఖాళీ స్టేడియంలో ఆడాలనుకోడు:
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ను ప్రేక్షకులు లేకుండా జరపొచ్చు కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 'ప్రేక్షకులు లేకుండా ఏ ఆటగాడూ కూడా ఖాళీ స్టేడియంలో మ్యాచ్లు ఆడాలనుకోడు. ఆటగాళ్లు ఉత్సాహంగా ఉండాలంటే ప్రేక్షకులు కచ్చితంగా ఉండాలి. అలా లేకపోతే ఆ టోర్నీ నిర్వహించడంలో అర్థం లేదు' గవాస్కర్ పేర్కొన్నారు.
కరోనా తీవ్రత గుర్తించలేకపోయాం:
'ఆదిలో కరోనా తీవ్రత గుర్తించలేకపోయాం. కానీ.. అది ఇప్పుడు విజృంభిస్తోంది. ఇప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వహించాలి. ఆరోగ్య ప్రమాణాలను పాటించాలి. ఇవి మన అలవాట్లను మారస్తుంది. దీంతో ఎక్కడ ఉమ్మి వేయకుండా, ఎక్కడా చెత్త వేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం. ఇది దేశంలో ఎంతో మార్పు తీసుకువస్తుంది' అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.
నెల రోజుల తర్వాత ఐపీఎల్ పెట్టుకోవచ్చు:
భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. 'పరిస్థితులను బట్టి అనేక విషయాలు ముడిపడి ఉంటాయి. పరిస్థితుల్లో మార్పులు రాకపోతే, మరింత దారుణ పరిస్థితులు తలెత్తితే ఐపీఎల్ను నిర్వహించడం కుదరదు. ఐపీఎల్తో అనేక మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ప్రేక్షకులు హోటల్స్లో బస చేయడం, విమానాల్లో ప్రయాణించడం వల్ల వైరస్ సోకే అవకాశాలుంటాయి. ప్రజల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి ప్రభుత్వం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. మ్యాచ్లను నెల రోజుల తర్వాత అయినా పెట్టుకోవచ్చు' అని భజ్జి అన్నారు.