న్యూఢిల్లీ: భారత క్రికెట్లో కీలక పరిణామం. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ప్రపంచకప్ తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కోహ్లీ వెల్లడించాడు. ఇక కోహ్లీ ప్రకటనతో ఇప్పుడిక టీ20ల్లో అతని వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు విజేతగా నిలపడంతో బెస్ట్ కెప్టెన్గా పేరు తెచ్చుకోవడమే కాక.. కోహ్లీ అందుబాటులో లేనపుడు భారత జట్టును చక్కగా నడిపించిన రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కోహ్లీ కంటే రెండేళ్లు పెద్దవాడు, ఇంకో మూణ్నాలుగేళ్లలో రిటైరయ్యే అవకాశమున్న 34 ఏళ్ల రోహిత్కు కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ అప్పగించడం సరైందేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్, శ్రేయస్, పంత్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
అయితే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కేఎల్ రాహుల్ను సారథిగా ఎంపికచేయాలన్నాడు. కేఎల్ రాహుల్లో నాయకత్వ లక్షణాలున్నాయని, భవిష్యత్తు కెప్టెన్గా అతన్ని ప్రోత్సహించాలని సూచించాడు. 'బీసీసీఐ భవిష్యత్తుపై దృష్టిపెట్టడం మంచి విషయం.
భారత్ ఓ కొత్త కెప్టెన్ను తయారు చేయాలనుకుంటే రాహుల్పై దృష్టి పెడితే మంచిది. ఇంగ్లండ్లో అతను చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతన్ని వైస్ కెప్టెన్ను చేసే అవకాశమైతే ఉంది. ఐపీఎల్లోనూ రాహుల్ కెప్టెన్గా ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్ దెబ్బతినకుండా చూసుకున్నాడు'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
2014 ఆస్ట్రేలియా పర్యటనలో బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. కెరీర్లో ఇప్పటివరకు 40 టెస్ట్లు, 38 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన రాహుల్.. 2018 సీజన్కు ముందు పంజాబ్కు మారాడు.