పోటీపడి మరీ వికెట్లు: భారత బ్యాట్స్మెన్ షాట్ సెలక్షన్పై మండిపడ్డ సన్నీ

హైదరాబాద్: భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు తొలి టెస్టులోనే ఆసీస్ బౌలర్లు షాకిచ్చారు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా గురువారం అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలిరోజు పుజారా మినహాయించి మిగతా భారత బ్యాట్స్మన్ పూర్తిగా నిరాశపరిచారు.
ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆట తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శించాడు. భారత జట్టు తొలి సెషన్లోనే కీలక వికెట్లను చేజార్చుకోవడాన్ని మండిపడ్డాడు. భారత టాపార్డర్ ఆటగాళ్లు ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బంతుల్ని వెంటాడి మరీ పెవిలియన్కు చేరడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. తొలి సెషన్లోనే భారత్ వికెట్లను కోల్పోవడానికి పేలవమైన షాట్ సెలక్షనే కారణమని గవాస్కర్ విమర్శించాడు.

గవాస్కర్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా మాట్లాడుతూ "ఒక టెస్టు మ్యాచ్కు ఆడేటప్పుడు ఇలాగేనా ఆడేది. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు వికెట్లు సమర్పించుకుంటారా?. వదిలేయాల్సిన బంతులపైకి వెళ్లి మరీ వికెట్లు చేజార్చుకోవడమేంటి. కోకోబుర్రా బంతులు కేవలం కొన్ని ఓవర్లు పాటే స్వింగ్ కావడానికి సహకరిస్తాయి. అటువంటప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మానేసి ఇంత నాసిరకంగా ఔటవుతారా?" అని గవాస్కర్ మండిపడ్డాడు.

తొలి సెషన్లోనే పోటీ పడి మరీ వికెట్లు కోల్పోయారు
"ప్రతీ ఒక్కరూ తొలి సెషన్లోనే పరుగులు చేయడానికి పోటీ పడి మరీ వికెట్లు కోల్పోయారు. ఇది ఐదు రోజుల టెస్టు మ్యాచ్లో తొలి సెషన్ అనే సంగతినే మరిచారు. టీమిండియా సిరీస్ను ఇలా ఆరంభించడం నిజంగానే బాధాకరం" అని గవాస్కర్ పేర్కొన్నాడు. జట్టు స్కోరు 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న టీమిండియా పుజారా ఆదుకున్నాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 250/9
పుజారా(123; 246 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మహమ్మద్ షమీ(6), జస్ప్రీత్ బుమ్రా (0) పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్స్లో హాజిల్వుడ్, లియాన్, కమిన్స్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications