నేపియర్: వెలుతురు లేమితో ఆటకు అంతరాయం కలగడం చూశాం. కానీ విచిత్రంగా భగభగ మండే సూర్యుడి కారణంగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన మూడో టీ20కి కొద్దిసేపు అంతరాయం కలిగింది. సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్మెన్ కళ్లలో పడడంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. కివీస్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హారీస్ రౌఫ్ వేసిన నాలుగో బంతికి గ్లెన్ ఫిలిప్స్ సింగిల్ తీశాడు. కిరణాలు నేరుగా బ్యాట్స్మెన్ కళ్లలో పడటం వల్ల బౌలర్ వేసిన బంతులను ఎదుర్కోలేకపోయాడు. ఆ వెంటనే ఫీల్డ్ అంపైర్లు చర్చించుకొని కొద్దిసేపు ఆటను నిలిపేశారు. ఆ తర్వాత యథావిధిగా ఆటను కొనసాగించారు.
ఇక సూర్యుడి వల్ల ఆటను తాత్కాలికంగా నిలిపివేయడం నేపియర్(మెక్లీన్ పార్క్) మైదానంలో రెండోసారి. 2019 జనవరిలో భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్లో బ్యాట్స్మన్ కళ్లలోకి సూర్య కిరణాలు పడుతున్నాయని మ్యాచ్ను కాసేపు ఆపారు. బ్యాటింగ్ చేస్తుండగా తన కళ్లలో వెలుగు పడుతోందని శిఖర్ ధావన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు.
ఇక న్యూజిలాండ్తో జరిగిన ఈ ఆఖరి టీ20లో పాకిస్థాన్ 4 వికెట్లతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను ఓడి సిరీస్ చేజార్చుకున్న దాయాదీలు.. చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 రన్స్ చేసింది. డేవెన్ కాన్వే(63), గ్లేన్ ఫిలిప్స్(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ప్రత్యర్థి బౌలర్లలో ఫహీమ్ అశ్రఫ్ మూడు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిదీ, హారీస్ రౌఫ్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్ చేసి రెండు బంతులుండగానే విజయాన్నందుకుంది. మహ్మద్ రిజ్వాన్ (89), మహ్మద్ హఫీజ్(41) రాణించారు. హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ రిజ్వాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
సచిన్ కొడుకును చితక్కొట్టిన సూర్యకుమార్ యాదవ్.. 9 సిక్సర్లతో వీరవిహారం!