
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ను స్మిత్ 4-0తో జేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరిస్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించడంలో బౌలర్లు కీలకపాత్ర పోషించారు.
ఈ సిరిస్లో ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్లు మిచెల్ స్టార్క్ (22), జోష్ హెజల్ ఉడ్ (21), కమ్మిన్స్ (23), నాథన్ లియాన్ (21) ఇలా ప్రతి ఒక్కరూ 20కి పైగా వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. మరోవైపు పర్యాటక ఇంగ్లాండ్ జట్టులో జేమ్స్ ఆండర్సన్ ఒక్కడే 17 వికెట్లు తీసుకున్నాడు.
ఈ సిరిస్లో స్టీవ్ స్మిత్ 137.40 యావరేజితో 687 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో స్మిత్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని సైతం అందుకున్నాడు. ఈ సిరిస్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించగా... అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక, పెర్త్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ (239)తో రాణించడంతో ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఆసీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారడంతో డ్రాగా ముగిసింది.
మ్యాచ్ అనంతరం మెల్ బోర్న్ పిచ్పై ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 4-0తో కైవసం చేసుకోవడంతో ఆసీసీ మాజీ క్రికెటర్లు స్మిత్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.