కొలంబో: శ్రీలంకకు చెందిన యువ క్రికెటర్ బంతి తగిలి మైదానంలో తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... టెస్టు ఓపెనర్ కౌశల్ సిల్వ పల్లెకిలెలో జరగుతున్న ఓ స్వదేశీ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి తల భాగాన్ని సిటీ స్కాన్లు తీయించారు. దీంతో అతడి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, తదుపరి పరీక్షల కోసం అతడిని రాజధాని కొలంబోకు తరలించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా కౌశల్ సిల్వ ఇప్పటివరకు శ్రీలంక జట్టు తరఫున 24 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1,404 పరుగులు చేశాడు.
షార్ట్లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా సిల్వకు బాల్ తగిలిందని టీమ్ మేనేజర్ సేనానాయకే తెలిపారు. శ్రీలంక జట్టు వైస్ కెప్టెన్ దినేష్ చండీమల్ వెంటనే కౌశల్ తల వెనక వైపునకు పరుగెత్తి, దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించినా, అప్పటికే బాల్ అతడి తలను తాకిందని చెప్పారు. 2014లో ఇదే విధంగా ఆస్టేలియన్ బ్యాట్స్మన్ ఫిలిప్ హ్యూస్ తలకు బంతి తగలడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాతి నుంచి ఆటగాళ్ల భద్రత కోసం అదనపు ప్యాడింగ్తో కూడిన హెల్మెట్లను ఉపయోగిస్తున్నారు. బంతి తగిలే సమయానికి కౌశిల్ సిల్వ అలాంటి హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. వచ్చే నెలలో ఇంగ్లండ్లో శ్రీలంక జట్టు పర్యటన ఉండటంతో దానికి సన్నాహకంగా జరిగిన మ్యాచ్లో సిల్వ గాయపడ్డాడు.