సిక్సర్ లేదు:
వన్డే మ్యాచ్లో 345 పరుగులు భారీ స్కోరు. స్కోరు బోర్డుపై ఇంత భారీ స్కోరు నమోదయిందంటే మాటలు కాదు. బ్యాట్స్మెన్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగుతారు. కానీ.. శ్రీలంక బ్యాట్స్మెన్ మాత్రం పూర్తిగా బిన్నంగా ఆడారు. ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (127; 123 బంతుల్లో 10×4), కుశాల్ మెండిస్ (119; 119 బంతుల్లో 12×4) సెంచరీలతో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి లంకకు భారీ స్కోర్ అందించారు. ఇద్దరూ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు.
ఇంగ్లండ్ రికార్డు బద్దలు:
లంక 8 వికెట్లు నష్టపోయి 345 పరుగులు చేసింది. ఇద్దరు సెంచరీ చేసినా.. ఒక్క సిక్సర్ కూడా నమోదు చేయలేదు. ఇక సిక్సర్ లేకుండా 50 ఓవర్ల క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2011లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ సిక్సర్ లేకుండా ఆరు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఇప్పుడు లంక జట్టు ఈ రికార్డును తిరగరాసింది.
రికార్డు భాగస్వామ్యం:
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 161 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కరుణరత్నె (1), కుషాల్ పెరీరా (0) విఫలమవడంతో 9/2తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఫెర్నాండో, మెండిస్ శతకాలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 239 పరుగులు జతచేశారు. లంక ఇన్నింగ్స్లో మొత్తం 33 బౌండరీలు నమోదయ్యాయి. విండీస్ బౌలర్లలో కాట్రెల్కు 4, జోసెఫ్కు మూడు వికెట్లు దక్కాయి.
సిరీస్ కైవసం:
అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాట్స్మెన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో విండీస్ 39.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. షై హోప్ (51) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. లంక బౌలర్లలో సందకన్, హసరంగ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే తొలి మ్యాచ్లో గెలుపొందిన లంక.. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.