హైదరాబాద్: శ్రీలంక-భారత్ జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో టాస్ ఎవరు గెలిచారన్న విషయంపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ టాస్ గెలిస్తే కోహ్లీ టాస్ గెలిచినట్లు ప్రకటించి భారీ తప్పిదం చేశారంటూ మీడియాలో వార్త వచ్చిన సంగతి తెలిసిందే.
టీ20లో రిఫరీ పొరపాటు: టాస్ తప్పిదం, గెలిచింది కోహ్లీ కాదా?
టాస్ వేసే క్రమంలో భారత్-శ్రీలంక జట్ల కెప్టెన్లు కోహ్లీ, ఉపుల్ తరంగ మైదానంలోకి వచ్చారు. కోహ్లీ హెడ్స్ను ఎంచుకోగానే, లంక కెప్టెన్ ఉపుల్ తరంగ కాయిన్ గాల్లోకి విసిరాడు. అది చూసిన రిఫరీ పాయ్ క్రాఫ్ట్ టైల్స్.... ఇండియా అనడంతో కోహ్లీ టాస్ గెలిచినట్లు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మురళీ కార్తీక్ ప్రకటించాడు.
ఇక్కడ రిఫరీ సరిగ్గానే చెప్పినప్పటికీ, కార్తీక్ మాత్రం సరిగా వినకపోవడంతో భారత టాస్ గెలిచినట్లయ్యింది. అయితే తప్పిదాన్ని గుర్తించేలోపే కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగిపోయింది. దీంతో చేసేదేమీ లేక ఈ విషయాన్ని అక్కడితో వదిలేశారు. రిఫరీని సరిగా అర్ధం చేసుకోవడంలో కార్తీక్ చేసిన తప్పిదం కారణంగా టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
తాజాగా, టాస్ ఎవరు గెలిచారన్న దానిపై నెలకొన్న అయోమయానికి తెరదించాలనే ఉద్దేశంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రిఫరీ నుంచి ఎటువంటి తప్పిదం జరగలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని మీరు ఇక్కడ చూడొచ్చు.
#SLvInd T20I: Match Referee Andy PYCROFT called it correctly - "Heads India". Watch the video pic.twitter.com/tsYTHv8UCC
— Sri Lanka Cricket (@OfficialSLC) September 8, 2017
కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకొంది. లంక నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించి ఘన విజయం సాధించింది.