కొలొంబో: దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని ఆశించిన శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కి లంక ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ ఎదురైంది. హోమాగమా వేదికగా స్టేడియం నిర్మాణం కోసం 26 ఎకరాల స్థలాన్ని కూడా శ్రీలంక బోర్డు ఇప్పటికే పరిశీలించింది. కానీ.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన శ్రీలంక ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. దాంతో స్టేడియం నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా 228 జెర్సీ నెంబర్నే ఎందుకు వేసుకుంటాడో తెలుసా?!!
కరోనా కష్టకాలంలో ఉన్న స్టేడియంలలో ఆడేవాళ్లే దిక్కులేకుంటే.. ఇంకా కొత్త మైదానాలు అవసరమా అని లంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే ప్రశ్నించిన నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సే స్టేడియం నిర్మించాలనే ఆలోచనను విరమించుకోమని స్పష్టం చేశారు. 'మోమగామాలో కొత్తగా నిర్మించాలనుకున్న క్రికెట్ స్టేడియం ప్రతిపాదనను పక్కన పెడుతున్నాం' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
స్టేడియం నిర్మాణ ప్రతిపాదనపై మహేల జయవర్దనె తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని స్టేడియాల్లో సరిగా మ్యాచ్లు కూడా జరగడం లేదన్నాడు. సుమారు రూ. 300 కోట్లతో కొత్త స్టేడియాన్ని కట్టాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించాడు. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, మాజీ క్రికెటర్లతో చర్చలు జరిపిన లంక ప్రభుత్వం ఆ స్టేడియం నిర్మాణ ప్రాజెక్ట్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నిర్ణయంపై లంక బోర్డు ఎలాంటి ప్రతిస్పందన తెలపలేదు.
అయితే స్టేడియానికి ఖర్చు చేయాలనుకున్న నిధుల్ని లోకల్ స్టేడియాల్లో మెరుగు సదుపాయాలకి ఉపయోగిస్తామని శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే వెల్లడించారు. అంతేకాదు స్కూల్ క్రికెట్ డెవలప్మెంట్కి వినియోగించబోతున్నట్లు పేర్కొన్నారు. ఐసీసీ మెగాటోర్నీల ఆతిధ్యానికి కొత్త స్టేడియంను నిర్మించాలని ఎస్ఎల్సీ మొదట తలపెట్టింది. 2023 నుంచి 2031 మధ్య ఐసీసీ ఈవెంట్ల కోసం ప్రయత్నించాలని భావించిన బోర్డు 60 వేల మంది వీక్షించేలా కొత్త స్టేడియం నిర్మించాలనుకుంది.
శ్రీలంకలో ఇప్పటికే కొలంబో, దంబుల్లా, పల్లెకలె, హంబన్టోట, కాండీ, గాలె, మొరటువా రూపంలో ఏడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఇందులో కొలంబో, దంబుల్లా, పల్లెకలె, గాలెలలో ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతాయి. హంబన్టోట, కాండీ, మొరటువాలో అప్పుడప్పుడు మాత్రమే మ్యాచ్లు జరుగుతాయి.