న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ నమాన్ ఓజా అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున ఏకైక వన్డే, టెస్ట్, రెండు టీ20లు ఆడిన 37 ఏళ్ల ఈ మధ్య ప్రదేశ్ ప్లేయర్ సోమవారం తన ఆటకు గుడ్బై చెప్పాడు. తన కెరీర్కు అండగా నిలిచిన కోచ్లు, కెప్టెన్లు, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కృతజ్ఞతలు తెలిపాడు.
2010లో శ్రీలంకపై ఏకైక వన్డే ఆడిన నమాన్ ఓజా.. అదే ఏడాది జింబాంబ్వేపై అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. కాకపోతే అతని అంతర్జాతీయ టీ20 కెరీర్ రెండు టీ20లకే పరిమితమైంది. ఇక 2015 శ్రీలంక పర్యటనలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వృద్దిమాన్ సాహా గాయపడటంతో ఓజాకు టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశ రాగా.. ఆ మ్యాచ్లో 21, 35 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ అనంతరం మళ్లీ ఓజాకు టీమిండియాలో అవకాశాలు దక్కలేదు.
అంతర్జాతీయ కెరీర్ అంతంత మాత్రమే ఉన్నా.. దేశవాళీలో నమాన్ ఓజా అద్భుతంగా రాణించాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో 7,861 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల జాబితాలో ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఇక వికెట్ కీపర్గా 351 ఔట్లలో పాలుపంచుకొని టాప్లో కొనసాగుతున్నాడు. కెరీర్లో 146 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన ఓజా.. 41.67 సగటుతో 9,753 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో ఓజా అత్యధిక స్కోరు 219 పరుగులు. అలానే 143 లిస్ట్-ఎ మ్యాచ్లు, 182 టీ20లను కెరీర్లో ఓజా ఆడాడు.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడిన నమాన్ ఓజా.. 2016 చాంప్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2012 సీజన్లో ఢిల్లీకి ఆడుతూ ఓపెనర్ డేవిడ్ వార్నర్తో కలిసి రెండో వికెట్కు నమన్ ఓజా నెలకొల్పిన 189 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం.. ఇప్పటికీ ఆ టీమ్ తరఫున అత్యుత్తమం కావడం గమనార్హం.
ఐపీఎల్ 2018 సీజన్లోనూ ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున మ్యాచ్లాడిన నమన్ ఓజా.. పేలవ ఫామ్ కారణంగా టీమ్లో చోటు కోల్పోతూ వచ్చాడు. దేశవాళీ క్రికెట్లోనూ గత కొన్ని సీజన్లుగా తేలిపోతూ వచ్చిన ఈ వికెట్ కీపర్ తాజాగా ఆటకి గుడ్ బై చెప్పేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఓజాకు సహచర ఆటగాళ్లు అభినందనలు తెలుపుతున్నారు.