హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టు గాడిలో పడేందుకు ఒక మంచి ప్రదర్శన అవసరమని ఆ జట్టు ఆల్ రౌండర్ జేపీ డుమిని పేర్కొన్నాడు. ఐసీసీ వరల్డ్కప్ మెగా టోర్నీలో భాగంగా సఫారీలు ఆడిన మొదటి రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలయ్యారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆరంభ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 104 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత గత ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సఫారీలు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ఢీలా పడిపోయారు.
టోర్నీలో భాగంగా బుధవారం టీమిండియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ నేపథ్యంలో జేపీ డుమిని మాట్లాడుతూ "టీమిండియాలో ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక, బౌలింగ్ విభాగానికి వస్తే చాలా పటిష్టంగా కనిపిస్తోంది. స్పిన్ త్రయంతో పాటు జస్ప్రిత్ బుమ్రా అద్భుత ఫామ్లో ఉన్నాడు" అని అన్నాడు.
"ఐపీఎల్లో బుమ్రా మంచి ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో ఇవే మాకు ప్రమాదకరం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆ జట్టులో ఉన్నాడు. ధోని అనుభం గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరితో కూడా చాలా ప్రమాదకరం" అని జేపీ డుమిని చెప్పుకొచ్చాడు.
"అయితే, ర్యాంకుతో సంబంధం లేకుండా మ్యాచ్ ఆడేటప్పుడు ఏ జట్టు మంచి ప్రదర్శన చేస్తే అదే గెలుస్తుందని, ఈ ఆటలో ఉన్న వైవిధ్యం ఇదే. భారీ స్కోర్ ఛేదించేటప్పుడు మంచి భాగస్వామ్యాలు అవసరం. అవే జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ఆటగాళ్లు బాగా ఆడి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలి" అని డుమిని అన్నాడు.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో తమ ఆటగాళ్లు అలా ఆడలేదని, అందరూ 30-40 పరుగులకే పరిమితమయ్యామని జేపీ డుమిని అన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్-మర్క్రమ్ రెండో వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా... నాలుగో వికెట్కు డుసెన్-డేవిడ్ మిల్లర్లు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే, ఈ భాగస్వామ్యాలు జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. జూన్ 5న కోహ్లీసేనతో జరిగే మ్యాచ్లో తమ లోపాలను సరిచేసుకుంటామని ఈ సందర్భంగా జేపీ డుమిని స్పష్టం చేశాడు.