హైదరాబాద్: ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నుంచి టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. జులై 6 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ టెస్టుకు దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ అందుబాటులో ఉండటం లేదు.
కుటుంబ కారణాల వల్ల అతడు మ్యాచ్కు దూరమవుతున్నాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. డుప్లెసిస్ భార్య ఇమారి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అతడు ఇంగ్లాండ్ నుంచి స్వదేశం చేరుకున్నాడు.
ఈ క్రమంలో డుప్లెసిస్ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టు ఆడడం లేదని ఆ జట్టు మేనేజర్ డాక్టర్ మహ్మద్ ముసాజీ తెలిపారు. వారం రోజుల తర్వాత డుప్లెసిస్ లండన్ చేరుకుంటాడని ఆయన తెలిపారు. అతడి స్థానంలో ఓపెనింగ్ బ్యాట్స్మన్ డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికాకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
తద్వారా డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా 12వ టెస్టు కెప్టెన్ అవుతున్నాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరిస్ సందర్భంగా దక్షిణాఫ్రికా కోచ్ రస్సెల్ డొమినిగో మీడియాతో మాట్లాడాడు. ఈ సిరిస్లో డీన్ ఎల్గర్ దూకుడుగా ఆడతాడని తాను భావిస్తున్నానని అన్నారు.
టెస్టు క్రికెట్లో అతడికి ఎంతో అనుభవం ఉందని, టెస్టు ఓపెనర్గా కూడా జట్టుకు మంచి విజయాలను అందించాడని కోచ్ తెలిపాడు. కెప్టెన్గా రాబోయే రోజుల్లో అతడితో కలిసి పని చేసేందుకు తానెంతో ఆతృతగా ఉన్నట్లు కోచ్ రెస్సెల్ తెలిపాడు.