కెప్టెనయ్యేవరకు అలా అనుకోలేదు
బీసీసీఐ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చేపట్టబోతున్న గంగూలీని పలువురు ప్రముఖులు అభినందించారు. భారత మాజీలతో సహా ఇతర దేశాల మాజీలు కూడా అభినందిస్తున్నారు. తాజాగా రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా దాదాను కొనియాడాడు. అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'భారత క్రికెట్ను మార్చిన ఒక వ్యక్తి సౌరవ్ గంగూలీ. 97-98కి ముందు పాకిస్థాన్ని టీమిండియా ఓడిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. గంగూలీ కెప్టెన్ అయ్యే వరకు పాకిస్థాన్ను ఓడించే సత్తా టీమిండియాకు ఉందని నేను ఎప్పుడూ అనికోలేదు' అని అన్నాడు.
గొప్ప నాయకుడు
'సౌరవ్ గంగూలీ భారత ఆటగాళ్లు ఆలోచించే విధానాన్నే మార్చేశాడు. భారత్ కోసం అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడు. ఎందరో ఆటగాళ్లకు కెరీర్ అందించాడు. అతడో గొప్ప నాయకుడు. ఆటగాళ్లలో నైపుణ్యాన్ని వెతికితీయడంలో అతడు నిజాయతీపరుడు. గంగూలీకి క్రికెట్పై అత్యుత్తమ అవగాహన ఉంది' అని అక్తర్ చెప్పుకొచ్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి గంగూలీ. దాదా అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అధ్యక్ష పదవిలో పది నెలలు
కొత్త నిబంధనల ప్రకారం గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిలో పది నెలల పాటు (సెప్టెంబర్ 2020) కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కోల్కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు. ఈనెల 23న బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాక క్యాబ్ పదవిని దాదా వదిలేయనున్నాడు.
2008లో రిటైర్మెంట్
గంగూలీ కెరీర్లో 113 టెస్ట్లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన గంగూలీ కెరీర్.. 1996లో టెస్ట్ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్ చీఫ్గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.