బెర్లిన్లో సచిన్:
సోమవారం బెర్లిన్లో నిర్వహించిన లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డుల ప్రదానోత్సవానికి సచిన్ వెళ్లారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా టెండూల్కర్కు ట్రోఫీని అందజేశారు. అనంతరం బ్రాండెన్బర్గ్ గేట్ ముందు నిల్చొని సచిన్ ఫొటోలు దిగారు. వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నేను చెప్పింది తప్పు కాదు:
సచిన్ ఇన్స్టాగ్రామ్లో తాజా ఫొటోలు చూసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించారు. ఇదివరకే సచిన్ను ట్రోల్ చేసిన దాదా.. మరోసారి సరదాగా కామెంట్ చేసారు. 'టెండూల్కర్.. నేను చెప్పిన దాంట్లో తప్పేంలేదు' అని కామెంట్ చేశారు. ఇటీవలే సచిన్ ఆస్ట్రేలియాలో నిర్వహించిన బుష్ఫైర్ ఛారిటీ మ్యాచ్ కోసం మెల్బోర్న్ వెళ్లారు. ఆ సందర్భంగా తీసుకున్న ఒక ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసారు.
కొందరు బాగా ఎంజాయ్ చేస్తారు:
అప్పుడు ( ఛారిటీ మ్యాచ్) దాదా తొలిసారి కామెంట్ చేసారు. 'కొందరు అదృష్టవంతులు ఉంటారు. సెలవు రోజులను కూడా బాగా ఎంజాయ్ చేస్తారు' అని సచిన్ను ఉద్దేశించి అన్నారు. దాదా బీసీసీఐ బాస్ అయ్యాక ఆయనకు తీరిక సమయమే ఉండడం లేదు. బీసీసీఐ సమావేశాలు, ఐపీఎల్ షెడ్యూల్, ఐసీసీ మీటింగ్స్ లాంటి వాటితో దాదా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంజాయ్ చేస్తున్న సచిన్పై దాదా సరదా వ్యాఖ్యలు చేసారు.
మూడు దశాబ్దాల పాటు:
సచిన్, గంగూలీ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. ఇద్దరూ దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత జట్టుకు సేవలందించారు. రికార్డు భాగస్వామ్యాలతో టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. రిటైర్మెంట్ అనంతరం కూడా ఇద్దరూ టీమిండియా క్రికెట్ భవితవ్యం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నారు. సచిన్, గంగూలీలు తమ పోస్టులతో సోషల్ మీడియా నెటిజెన్లను ఆకర్షిస్తున్నారు.