అందుకే మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపా:
ఆదివారం ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.... 'ఎంఎస్ ధోనీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. ఓ సారి ఛాలెంజర్ ట్రోఫీలో నా జట్టు తరపున ఓపెనింగ్ ఆడి.. సెంచరీ చేశాడు. తన సామర్థ్యం గురించి తెలుసు కాబట్టే.. వైజాగ్లో పాకిస్థాన్తో జరిగిన వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపా. ఆ మ్యాచ్లో మహీ అద్భుతంగా ఆడి 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారీ భారీ స్కోర్లు చేశాడు' అని తెలిపాడు.
మహీ అరుదైన బ్యాట్స్మన్:
'ఆరో స్థానంలోనే బరిలోకి దిగుతూ, ఆడేందుకు సరైన బంతులు మిగిలి ఉండకపోతే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అత్యున్నత శిఖరాలకు చేరేవాడు కాదు. డ్రెస్సింగ్ రూమ్లోనే కూర్చోబెడితే.. ఓ మంచి క్రికెటర్ తయారు కాడని నేను ఎప్పుడూ నమ్ముతా. ఓ ఆటగాడిని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలంటే అతణ్ని టాప్ఆర్డర్లో ఆడించాలి. ఎంఎస్ ధోనీకి అద్భుతమైన సామర్థ్యం ఉంది. ముఖ్యంగా అతడి సిక్స్ హిట్టింగ్ శక్తి అత్యుత్తమం. అతడు అరుదైన బ్యాట్స్మన్. టాపార్డర్లో ఆడాలని ధోనీకి నేను రిటైరయ్యే ముందు చాలా సార్లు సూచించా' అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
దాదా కెప్టెన్సీలోనే టీమిండియాలోకి:
సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఎంఎస్ ధోనీ.. 2005లో పాకిస్థాన్తో వన్డేలో మూడో స్థానంలో బరిలోకి దిగి 148 పరుగులతో అదరగొట్టాడు. కెరీర్లో ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు. కాగా భారత్కు రెండు ప్రపంచకప్లను అందించిన మహీ.. ఈనెల 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాదా ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, జాహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు దాదా సారథ్యంలోనే వచ్చిన విషయం తెలిసిందే.
ఇంగ్లడ్తో పూర్తి స్థాయి సిరీస్:
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లడ్తో పూర్తి స్థాయి సిరీస్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్కు ముందు ఇంగ్లడ్ జట్టుతో స్వదేశంలో భారత్ ఆడుతుందని వెల్లడించాడు. కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన సిరీస్లను నిర్వహించేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపిన ఈమెయిల్లో దాదా పేర్కొన్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. తిరిగి వచ్చాక ఇంగ్లండ్తో ఆడుతుందని ఆయన స్పష్టం చేశాడు.