
హైదరాబాద్: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్తో టెస్టు క్రికెట్ ఇంకా బతికే ఉందనే భావన కలుగుతోందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు వర్షం అడ్డు తగలడంతో తొలిరోజు ఆట సాధ్యపడలేదు.
ఆ తర్వాత ఉత్కంఠ భరితంగా సాగి చివరికు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఫలితం కోసం తీవ్రంగా కష్టపడ్డాయి. క్రికెట్ అభిమానులకు అసలైన టెస్టు మజాను పంచాయి. ముఖ్యంగా స్టీవ్ స్మిత్-జోఫ్రా ఆర్చర్ల మధ్య చోటు చేసుకున్న సంఘటన మైదానంలో కాసేపు ఉత్కంఠను రేకెత్తించింది.
ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకింది. దీంతో స్టీవ్ స్మిత్ మైదానంలో కుప్పకూలాడు. దీంతో మ్యాచ్ని వీక్షిస్తోన్న అభిమానులతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా కంగారుపడ్డారు.
అనంతరం ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టు అనంతరం గంగూలీ మిగతా దేశాలు తమ టెస్టు క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించాడు.
ఈ మేరకు తన ట్విట్టర్లో "యాషెస్ సిరిస్తో టెస్టు క్రికెట్ ఇంకా బతికే ఉందనే భావన కలుగుతోంది. మిగతా దేశాలు తమ టెస్టు క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలి" అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు.