
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఒక్క మ్యాచ్లోనూ రాణించలేకపోయిన రోహిత్ శర్మ మంగళవారం జరిగిన ఐదో వన్డేలో అతి కష్టంపై క్రీజులో నిలదొక్కుకున్నాడు. సెంచరీకి మించిన స్కోరును చేసి తాను వన్డేలలో రాణించగలనని మరోసారి నిరూపించుకున్నాడు. అతనికి భాగస్వామిగా వచ్చిన కోహ్లీ, రహానెలు రనౌట్లు కావడంతో దానికి కారణం రోహిత్యే నంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
రోహిత్ శర్మపై సోషల్మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడ్డారు. మోర్కెల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడిన రోహిత్ సింగిల్ కోసం ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ఆగిపోయాడు. అయితే మరోవైపు నుంచి కోహ్లి సగం పిచ్ దాటి దూసుకొచ్చేశాడు. వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే డుమిని డైరెక్ట్ త్రో నాన్ స్ట్రైకింగ్ వికెట్లకు తాకింది. మరి కొద్ది సేపటికే రహానే (8) కూడా దాదాపు ఇలానే రనౌట్ అయ్యాడు.
ఈ రనౌట్లకు రోహితే కారణమని అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. ''రెండు రనౌట్లకు కారణమైన నువ్వు యోయో టెస్ట్ ఎలా పాసయ్యావో తెలియడం లేదని' ఒకరంటే.. 'ఇంకా ఎన్ని రనౌట్లు కారణమైతావయ్యా' అని మరొకరు.. 'రోహిత్ స్వార్థపరమైన ఆట ఆడాడని', 'కోహ్లీ ఎక్కడ సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడో అని రోహిత్ ను సీక్రెట్ ఏజెంట్గా నియమించి రనౌట్ చేయించాడని' ఇంకొకరు ట్రోల్ చేస్తున్నారు.
గత నాలుగు వన్డేల్లో దారుణంగా విఫలమైన రోహిత్ ఈ మ్యాచ్లో శతకం సాధించి ఫామ్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అభినందనలు తెలుపాల్సిన అభిమానులు రోహిత్ ఫిట్నెస్పై విమర్శలు గుప్పించడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. కీలక ఆటగాళ్లు రనౌట్లు కావడంతోనే భారత్ భారీ స్కోర్ సాధించలేకపోయిందని, ఇదే అభిమానులకు ఆగ్రహం తెప్పించిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.