గ్రేటర్ నోయిడా: ఇటీవలే భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్లోని రెండు మ్యాచ్లు 'సూపర్ ఓవర్' ద్వారానే ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండు మ్యాచ్లలో భారత్ గెలవడం విశేషం. ఈ రెండు మ్యాచ్లు అభిమానులను ఎంతో త్రిల్కు గురిచేశాయి. అలాంటి మరో మ్యాచ్ అఫ్గానిస్తాన్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో 'సూపర్ ఓవర్' ద్వారా ఐర్లాండ్ నెగ్గింది.
ఇర్ఫాన్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఇండియా లెజెండ్స్కు రెండో విజయం!!
ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ కెవిన్ ఓబ్రైన్ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించాడు. కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ (9) నిరాశపరిచాడు. గారెత్ డెలానీ (29 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ టెక్టర్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో ఐర్లాండ్ మోస్తరు స్కోర్ చేసింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో నవీన్, ఖైస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అస్గర్ అఫ్గాన్ (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఉస్మాన్ ఘని (18), కరీం జనత్ (17), రషీద్ ఖాన్ (14) పరుగులు చేసారు. ఐర్లాండ్ బౌలర్లలో సిమి సింగ్, డెలానీ తలో రెండు వికెట్లు తీశారు.
అఫ్గానిస్తాన్-ఐర్లాండ్ జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. సూపర్ ఓవర్లో మొదటగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేసింది. ఆపై ఐర్లాండ్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కెవిన్ ఓబ్రైన్ చివరి బంతికి సిక్స్ బాది తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన అఫ్గానిస్తాన్ 2-1తో సిరీస్ గెలుచుకుంది.