నాకు విరాట్ కోహ్లీనే..
రెండు తరాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం సరికాదని గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు అభిప్రాయపడినా ఈ చర్చ ఆగడం లేదు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మాత్రం తెలివిగా బదులిచ్చాడు. టెస్ట్ ఫార్మాట్లో సచిన్ బెస్ట్ బ్యాట్స్మన్ అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్ బెస్ట్ అని తెలిపాడు. తాజాగా భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను ఇదే ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీనే అని చెప్పాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో మూడు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో 360 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అందుకున్నాడు. ఈ సందర్భంగా గిల్కు 'సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీ' అనే ప్రశ్న ఎదురైంది.
కోహ్లీ ఆటను చూసే పెరిగాను..
'నా వరకూ విరాట్ కోహ్లీనే బెస్ట్. ఎందుకంటే నేను విరాట్ ఆటను చూసే పెరిగాను. సచిన్ సార్ వల్లే నేను క్రికెట్ ఆడడం మొదలెట్టా. ఎలాగంటే సచిన్కి మా నాన్న వీరాభిమాని. అందుకే నన్ను క్రికెట్గా మార్చాలని ఆయన కలలు కన్నారు. ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయానికి నేను ఇంకా చిన్న పిల్లాడినే. నేను క్రికెట్ని అర్థం చేసుకోవడం మొదలెట్టాక నాకున్న రోల్ మోడల్ విరాట్ భాయ్ మాత్రమే. విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. ఆయన బ్యాటింగ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. అందుకే నాకు విరాట్ భాయ్ రోలో మోడల్.' అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
4 వన్డేల్లో 2 సెంచరీలు.. ఒక డబుల్ సెంచరీ..
న్యూజిలాండ్తో మూడో వన్డేలో శుభ్మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్లతో 112) సెంచరీలతో చెలరేగాడు. తద్వారా వన్డేల్లో 4వ సెంచరీ నమోదు చేసిన శుభ్మన్ గిల్.. గత నాలుగు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీతో పాటు రెండు శతకాలు బాదాడు. ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో శుభ్మన్ గిల్ 208(149), 40 నాటౌట్(53), 112(78)లతో 360 పరుగులు చేశాడు. దాంతో ఓ వన్డే సిరీస్లో 300 ప్లస్ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ రికార్డును సమం చేశాడు. బాబర్ ఆజామ్ 2016లో వెస్టిండీస్తో సిరీస్లో 360 పరుగులు చేయగా.. గిల్ కూడా అన్నే రన్స్ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత ఇమ్రుల్ కమేస్(349), డికాక్(342), మార్టిన్ గప్టిల్(330) ఉన్నారు.