వారు లేకపోవడం పెద్ద లోటు:
తాజాగా రవిశాస్త్రి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'న్యూజిలాండ్ సిరీస్కు దాదాపు అయిదుగురు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వారు లేకపోవడం పెద్ద లోటు. జట్టుకు, వారికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. న్యూజిలాండ్లో భువనేశ్వర్ కుమార్ అన్ని ఫార్మాట్లలో ఎంతో ఉపయోగపడతాడు. ఇక టెస్టుల్లో ఇషాంత్ శర్మ కీలక పాత్ర పోషిస్తూ జట్టుకు సానుకూలాంశంగా ఉంటాడు. కానీ.. గాయాలు ఆటగాళ్లను జట్టు నుంచి దూరం చేశాయి' అని అన్నాడు.
ప్రధాన ఆటగాళ్లు దూరం:
గాయాలతో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకుని హార్దిక్ పాండ్య కోలుకుంటుండగా.. జస్ప్రీత్ బుమ్రా మొన్ననే రీఎంట్రీ ఇచ్చాడు. అయితే మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. మరి రోహిత్, భువనేశ్వర్, దీపక్ కోలుకుని ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
గిల్ జట్టుతోనే ఉంటాడు:
'శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. గత రెండేళ్లగా అతడి ఆటతీరుని పరిశీలిస్తున్నా. గిల్కు ఎంతో ప్రతిభ ఉంది. తొలి టెస్టులో అతడు ఉన్నా లేకపోయినా జట్టుతోనే ఉంటాడు. పృథ్వీ షా పునరాగమనం చేయడం సంతోషం. జట్టుతో అతడు ఎక్కువ సమయం గడిపితే తప్పకుండా తిరిగి గాడిలో పడతాడు. దొరికిన అవకాశాల్ని షా సద్వినియోగం చేసుకోవాలి. సవాళ్లను అధిగమించి రాణిస్తాడని ఆశిస్తున్నా' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
21న తొలి టెస్ట్:
ఐదు టీ20ల సిరీస్ను 5-0తో భారత్ కైవసం చేసుకోగా.. మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో సొంతం చేసుకుంది. ఇక రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది. అయితే టెస్టు సిరీస్కు ముందు హామిల్టన్లోని సెడాన్ పార్క్ మైదానంలో న్యూజిలాండ్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 78.5 ఓవర్లలో 263 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హనుమ విహారి (101 రిటైర్డ్హర్ట్; 182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ చేయగా.. ఛతేశ్వర పుజారా (93; 211 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో సెంచరీ కోల్పోయాడు.