ప్రభాస్ నా ఫేవరేట్:
కరోనా కారణంగా ప్రస్తుతం ఆటగాళ్లు అందరూ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శ్రేయాస్ అయ్యర్ అభిమానులతో చిట్ చాట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో దక్షిణాదిలో మీకు ఇష్టమైన స్టార్ ఎవరు? అని ఓ అభిమాని అడిగితే.. నా ఫేవరేట్ ప్రభాస్ అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. ప్రస్తుతం శ్రేయాస్ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రికెట్ కాకుండా ఫుట్బాల్ తన ఇష్టమైన క్రీడ అని, రోనాల్డో ఫేవరేట్ ప్లేయరని తెలిపాడు.
నాలుగో స్థానంలో శ్రేయస్ సరైనోడు:
గత మూడేళ్లుగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మ్యాచ్ విన్నర్లుగా భావించే కీలక స్థానాల్లో సరైన బ్యాట్స్మన్ లేక తీవ్ర ఇబ్బంది పడుతోంది భారత జట్టు. కొన్ని సందర్భాల్లో టాప్ఆర్డర్ విఫలమైతే ఇక జట్టును ఆదుకునే ఆటగాడే కరువయ్యాడు. అంబటి రాయుడు, అజింక్య రహానె, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, మనీశ్ పాండే, రిషభ్ పంత్.. ఇలా ఎంత మందికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ స్థానంలో మెరుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్.
ఐపీఎల్లోనూ తనదైన ముద్ర:
శ్రేయస్ టీమిండియా తరఫునే కాకుండా ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. 2015లో ఢిల్లీ జట్టు తొలిసారి అతడిని 2.6 కోట్లకు దక్కించుకుంది. అందుకు తగ్గట్టే శ్రేయస్ ఆ సీజన్లో 439 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. తర్వాత 2018లో గంభీర్ తప్పుకున్నాక ఢిల్లీ జట్టు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లోనే 411 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 2019లో బ్యాటింగ్లో రాణించడమే కాకుండా కెప్టెన్గానూ ప్రశంసలు అందుకున్నాడు. ఏడేళ్ల తర్వాతఢిల్లీని ప్లేఆఫ్స్కు తీసుకెళ్లి జట్టులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. ఇలా బ్యాట్స్మన్గానే కాకుండా కెప్టెన్గానూ అదరగొడుతున్నాడు. జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు.