కాంట్రాక్టులో లేని ఆటగాళ్లు కూడా:
2029 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతడి పేరును బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి కూడా తప్పించింది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ జరిగితే మహీ ఆడే అవకాశాలున్నాయని.. అప్పుడు అతను కచ్చితంగా సన్నాహక శిబిరంలో ఉంటాడని సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. కాంట్రాక్టులో లేని ఆటగాళ్లు కూడా శిబిరంలో పాల్గొనే అవకాశం ఉందని, యువ వికెట్ కీపర్లకు మార్గనిర్దేశం చేసేందుకైనా ధోనీ క్యాంపునకు వెళతాడన్నాడు.
మహీ తప్పక ఉంటాడు:
'టీ20 ప్రపంచకప్ జరిగితే సన్నాహక శిబిరంలో ఎంఎస్ ధోనీ తప్పక ఉంటాడు. ద్వైపాక్షిక సిరీస్లు జరిగితే అతనికి ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ ఎలాగో ఉన్నారు. వారికి తోడు వృద్ధిమాన్ సాహా కూడా ఉన్నాడు. ఆరు వారాలు జరిగే శిబిరంలో మహీ ఉంటే యువ వికెట్కీపర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. వారికి మార్గనిర్దేశం చేస్తాడు' అని ఎమ్మెస్కే చెప్పాడు. మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ... 'ఏడాదిగా క్రికెట్ ఆడకపోయినా, సెంట్రల్ కాంట్రాక్ట్లో లేకపోయినా ఐపీఎల్లో సత్తా చాటితే మహీ భారత జట్టు తలుపు తట్టే అవకాశాలను ఇప్పటికీ కొట్టిపారేయలేను' అని అన్నాడు.
ధోనీనే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్:
ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్లో టీమిండియా వికెట్ కీపర్గా ఎవరుంటారని మీరు ఊహిస్తున్నారు? అని పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ని ఓ అభిమాని ప్రశ్నించగా.. 'నా అంచనా ప్రకారం ఎంఎస్ ధోనీనే. బ్యాకప్గా లోకేష్ రాహుల్ ఉంటే బాగుంటుంది' అని సమాధానం ఇచ్చాడు. ఇప్పటికీ టీమిండియాకి ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ ధోనీనే అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. మహీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 16 సెంచరీలు బాదాడు.
డైలమాలో మహీ భవిష్యత్తు:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.