అనుష్కకు కూడా చెప్పా:
ఓ క్రీడా ఛానెన్లో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. 2014లో విరాట్ కోహ్లీ భారత టెస్ట్ జట్టు పగ్గాలు అందుకున్న రోజులను గుర్తుచేసుకున్నాడు. 2014లో ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలకడంతో.. టీమిండియా సారథిగా కోహ్లీ నియమితుడయ్యాడు. అప్పటికి కోహ్లీ వయసు దాదాపుగా 25 ఏళ్లు. 'బ్యాట్స్మన్గా అద్భుతంగా రాణిస్తున్న తొలి నాళ్లలోనే విరాట్ కోహ్లీపై కెప్టెన్సీ భారం మోపారు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టి తప్పు చేశాడని ఓ షోలో అతడి భార్య అనుష్క శర్మకు కూడా చెప్పా. సారథ్య బాధ్యతల వల్ల అతడిపై ఒత్తిడి అధికంగా ఉంటుందని వివరించా. ఓ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాననుకోండి' అని రావల్పిండి ఎక్స్ప్రెస్ తెలిపాడు. అనుష్క, కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
పేస్ ఎటాక్ దృఢంగా మారింది:
'క్రికెట్ను అమితంగా ఆరాధించే దేశంలో కెప్టెన్గా విఫలమైతే అతడిపై విమర్శలు వచ్చే ప్రమాదం ఉందనుకున్నా. అయినప్పటికీ ఇవన్నీ చాలా చాకచాక్యంతో అధిగమించాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్లోనే గెలుపు కోసం ప్రయత్నించాడు. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉన్న చాలా పిచ్లపై ఐదుగురు బౌలర్లతో ఆడేవాడు. బౌలర్లలో దూకుడు స్వభావాన్ని నింపాడు. ఫీల్డ్లో అతడు కెప్టెన్గా కాకుండా ఓ బౌలర్లా కనిపిస్తాడు. విరాట్ కెప్టెన్సీలో భారత పేస్ ఎటాక్ దృఢంగా మారింది' అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
ఎప్పుడూ అనుకూలంగానే:
రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ టీమిండియాకు ఎప్పుడూ అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటాడు. బాగా ఆడిన ఇండియన్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటాడు. అలానే దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచులు జరగాలని నిత్యం కోరుకుంటాడు. అయితే ఇరు దేశాల మధ్య వివాదాల కారణంగా కొన్నేళ్లుగా భారత్-పాక్ ద్విపాక్షిక సిరీసుల్లో పాల్గొనడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్న విషయం తెలిసిందే. అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్లు ఆడిన అక్తర్.. 444 వికెట్లు పడగొట్టాడు.