వేలంలో రూ. 8.50 కోట్లు:
ఇక భారత్లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో షెల్డాన్ కాట్రెల్ టీమిండియా ఆటగాడి వికెట్ తీసిన ప్రతీసారి సెల్యూట్ చేస్తూ భారత అభిమానుల ఆకట్టుకున్నాడు. అంతేకాదు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 8.50 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రాంచైజీ అతడిని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో మాత్రమే ఆడిన కాట్రెల్.. తోలిసారి ఐపీఎల్ టోర్నీలో ఆడనున్నాడు. పంజాబ్ తరపున ఆడనున్న కాట్రెల్.. ఐపీఎల్లో ఎంత ఎంజాయ్మెంట్ ఇవ్వనున్నాడో చూడాలి.
ఆసక్తిగా ఎదురుచూస్తున్నా:
తాజాగా ఓ ఇంటర్య్వూలో షెల్డన్ కాట్రెల్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రజాధరణ పొందిన ఐపీఎల్లో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉన్నా. మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్తో కలిసి బౌలింగ్ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా. సీపీఎల్కు, ఐపీఎల్కు చాలా తేడా ఉంటుంది. ఐపీఎల్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. మనమేంటనేది నిరూపించుకోవడానికి ఇక్కడ మంచి అవకాశం ఉంటుంది' అని అన్నాడు.
గేల్ చాలా కూల్:
'నా సహచరులైన క్రిస్ గేల్, నికోలస్ పూరన్లు పంజాబ్ జట్టులో ఉండడం కొంచెం ధైర్యమే. అయితే గేల్తో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. అతను చాలా కూల్గా ఉంటాడు. వీలైనప్పుడు గేల్తో మాట్లాడుతా. నికోలస్ పూరన్తో క్రికెట్ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు పంచుకుంటా. లెఫ్టార్మ్ బౌలర్లు ఎక్కువగా లేకపోవడం నాకు కలిసి వస్తుందనే విషయం గురించి చెప్పలేను. ఎందుకంటే క్రికెట్లో అలాంటి మాటలకు తావు ఉండదు. ఆటలో రకరకాల బౌలర్లు ఉంటారు. ఆరోజు ఎవరు రాణించారు అనే దానిపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాట్స్మన్ సాధారణంగా తన కెరీర్లో 80-85 శాతం కుడిచేతి వాటం బౌలర్నే ఎదుర్కొంటాడు. ఎడమచేతి వాటం కారణంగా బ్యాట్స్మెన్కు నా బౌలింగ్ ఇబ్బందిగానే ఉంటుందనుకుంటున్నా' అని కాట్రెల్ తెలిపాడు.
అవకాశం వస్తే 120 శాతం కష్టపడతా:
'టీ20లో విజయవంతమైన బౌలర్గా పేరున్న క్రిస్ జోర్డాన్ ఉండటం వలన నాకు అవకాశాలు తగ్గుతాయని నేను ఆలోచించడం లేదు. క్రిస్ జోర్డాన్ అద్భుతమైన బౌలర్. అలాగే మొహమ్మద్ షమీ కూడా గొప్ప ఆటగాడే. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించే ఆలోచిస్తున్నా. ఇక జట్టులో అవకాశం వస్తుందా అనేది నా చేతుల్లో ఉండదు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం 120 శాతం కష్టపడతా' అని వెస్టిండీస్ పేసర్ చెప్పాడు.
వంశపారపర్యంగా వస్తుంది:
'నేను ఫేమస్ అయ్యందే 'సెల్యూట్' ద్వారా. ఐపీఎల్ 2020లో కూడా నా సెల్యూట్స్ చాలానే ఉంటాయి. అభిమానులను ఎంటర్టైన్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నా. సెల్యూట్ అనేది మాకు వంశపారపర్యంగా వస్తుంది. దీనిని ఎప్పుడూ వదులుకోనూ (నవ్వుతూ). క్రికెట్ అంటే సీరియస్నెస్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అభిమానులకు తప్పనిసరిగా నా సెల్యూట్ చూసే అవకాశం ఉంటుంది' అని కాట్రెల్ హామీ ఇచ్చాడు.