
హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కొత్త కెప్టెన్గా ఎంపికైన దినేశ్ కార్తీక్ను ఆ జట్టు సహ యజమాని, బాలీవుడు నటుడు షారుక్ ఖాన్ అభినందించారు. కార్తీక్ ఎంపికను స్వాగతించారు. ఈ మేరకు షారుక్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు.
'సరికొత్త సీజన్లో అడుగు పెడుతున్న సందర్భంగా మా కెప్టెన్గా దినేశ్కు స్వాగతం పలుకుతున్నాం. గత మా కెప్టెన్ల మాదిరిగానే మీరూ మా జట్టును ముందుకు తీసుకెళతావని తెలుసు' అని షారుక్ ట్వీట్ చేశారు. ఐపీఎల్ 11వ సీజన్కు గాను దినేశ్ కార్తీక్ను కోల్కతా కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే.
గతంలో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా పనిచేసిన గౌతం గంభీర్ను వదిలేసుకున్న ఆ జట్టు.. ఈ సీజన్లో ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పాలనే దానిపై గత కొన్ని రోజులుగా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, క్రిస్లిన్, సునీల్ నరైన్లో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది.
అయితే చివరకు దినేశ్ కార్తీక్నే సారథిగా నియమించడానికి కేకేఆర్ యాజమాన్యం మొగ్గుచూపింది. ఐపీఎల్-2018 సీజన్లో దినేశ్ కార్తిక్ తమ జట్టును ముందుండి నడిపిస్తాడని ఫ్రాంఛైజీ సీఈవో వెంకీ మైసూర్ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. రాబిన్ ఊతప్పను వైస్ కెప్టెన్గా నియమించింది.
గత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ లయన్స్కు ఆడిన దినేశ్ కార్తీక్.. ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. జనవరిలో ఐపీఎల్ వేలంలో కార్తీక్ను రూ. 7.4 కోట్లకు కోల్కతా కొనుగోలు చేసింది. గత సీజన్లో దినేశ్ కార్తీక్ 14 మ్యాచ్ల్లో 361 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 152 మ్యాచ్ల ద్వారా 2,903 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
32 ఏళ్ల దినేశ్ కార్తీక్ ప్రస్తుతం భారత జట్టులో నిలకడగా చోటు దక్కించుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేశాడు. కెప్టెన్గా 2019-10 విజయ్ హజారే ట్రోఫీని తమిళనాడుకు అందించాడు. 2017లో ఇండియా రెడ్కు సారథ్యం వహించి దులీప్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. దీంతో దినేశ్ కార్తీక్కే జట్టు పగ్గాలు అప్పచెప్పేందుకు కోల్కతా యాజమాన్యం ఆసక్తి కనబరించింది.